చంద్రబాబుకు షాక్: టీడీపీ ప్రధాన కార్యాలయ భూకేటాయింపు రద్దుకు పావులు కదుపుతున్న వైసీపీ
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీ టార్గెట్ గా పని చేస్తుంది. చంద్రబాబుకు వరుస షాకులను ఇస్తుంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన అవినీతిని బట్టబయలు చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇక అంతే కాదు తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు.
టిడిపి ప్రధాన కార్యాలయ భూకేటాయింపుపై సీఎం జగన్ కు వైసీపీ నేతల లేఖలు
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించిన భూమి రద్దు చేయాలని వైసీపీ నేతలు పట్టుబడుతున్న తీరు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అత్యంత విలువైన భూములను అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అతి తక్కువ ధరకు టీడీపీకి కేటాయించిందని , ఇక దానిని రద్దు చేయాలని ఒక వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారు. టిడిపి ప్రధాన కార్యాలయం కోసం చేసిన భూకేటాయింపు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ వారు వేర్వేరుగా ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు.
స్పందించిన సీఎంవో కార్యాలయం .. పరిశీలించాలని రెవెన్యూ శాఖకు సిఫార్సు
దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించడంతో పాటు దానిని రెవెన్యూశాఖ కార్యదర్శి పరిశీలనకు పంపింది. ఇక దీనిపై ఇప్పుడు రెవెన్యూశాఖ కసరత్తు మొదలు పెట్టింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని 3.65 ఎకరాల భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తూ 2017 జూన్ 22న ప్రభుత్వం ఉత్తర్వులు జీవో 228 జారీ చేసింది. ఈ భూమిని 99 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన నాటి ప్రభుత్వం కేటాయించింది. ఏటా ఎకరానికి రూ.1000 లీజు ఫీజుగా నిర్ణయించి జరిపిన భూ కేటాయింపు పై ఇప్పుడు దుమారం రేగింది.
టీడీపీ హయాంలో భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపణ
ఇక నాటి ఉత్తర్వులలో భూమిని కేటాయించిన తర్వాత మూడేళ్లలో భూమిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఉత్తర్వుల్లో ఉంది. ఏడాదిలో ఒక భవన నిర్మాణం పూర్తి చేయాలని షరతు కూడా ఉంది. ఇక ఈ నేపథ్యంలో అత్యంత విలువైన భూమిని 99 ఏళ్ళు నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇవ్వడం, అలాగే ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున ఫీజుగా నిర్ణయించడం నాటి ప్రభుత్వ అక్రమాలకు నిదర్శనమని వైసిపి ఆరోపిస్తోంది. ఆ భూమికి సంబంధించిన కేటాయింపులు రద్దు చేయాలని పేర్కొంటుంది.
ఇప్పటికే నిర్మాణం అయిన టీడీపీ ప్రధాన కార్యాలయం
అయితే, ఈ భూమి కేటాయింపు ఉత్తర్వు ఇచ్చిన రెవెన్యూ శాఖ, ఇప్పుడు భూ కేటాయింపు సంబంధించిన ఉత్తర్వుల పై పరిశీలన చేస్తోంది . అయితే ఇప్పటికే ఆ భూమిలో టిడిపి ప్రధాన కార్యాలయం నిర్మాణం జరిగింది .డిసెంబరు ఆరో తేదీన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది టిడిపి. ఇక ఈ సమయంలో టీడీపీకి కేటాయించిన భూమిని రద్దు చేయాలని, అది నిబంధనలకు విరుద్ధమని వైసీపీ నేతలు ప్రభుత్వానికి లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ ఆఫీసులను టార్గెట్ చేసిన వైసీపీ ..టీడీపీ ప్రధాన కార్యాలయ భూమికే ఎసరు
ఇదే సమయంలో కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కోసం గుణదలలో కేటాయించిన ప్రభుత్వ భూమిని కూడా వెనక్కు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యాలయాలపై గట్టిగా దృష్టి పెట్టిన వైసీపీ గతంలో విశాఖపట్టణంలోని టీడీపీ కార్యాలయానికి అనుమతులు లేవని చేసిన ఫిర్యాదుతో నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత గుంటూరులో ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కార్యాలయంగా చెప్పుకునే పార్టీ ఆఫీసుకే ఎసరు పెట్టారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఏకంగా టీడీపీ ప్రధాన కార్యాలయ భూమికే ఎసరు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీ ని ఇబ్బంది పెట్టడానికి, చంద్రబాబుని ఇరకాటంలో పెట్టడానికి వైసిపి ప్రయత్నం చేస్తుంది అనేది తాజా పరిణామాలతో అర్థమవుతుంది.