చింతమనేనికి షాక్ ... బెయిల్ నిరాకరించిన కోర్టు .. అక్టోబర్ 9 వరకు రిమాండ్ పొడిగింపు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ బెయిల్ కు నిరాకరించింది ఏలూరు కోర్టు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరిన చింతమనేని ప్రభాకర్ కు బెయిల్ నిరాకరించింది కోర్టు.
నేడు విచారణ సందర్భంగా ఆయన్ని ఏలూరులోని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే నెల 9 వరకూ చింతమనేని రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దళితులను దూషించిన కేసులో చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉన్న చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. దళితులు దూషించిన కేసు మాత్రమే కాకుండా , చింతమనేని పై కేసు పెట్టిన వారిని చంపుతానని హెచ్చరించారని మరో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు.
2017లో ఒక స్థలం వివాదంలో వ్యక్తిని నిర్బంధించి, కులం పేరుతో దూషించిన ఘటనలో చింతమనేనిపై కేసు నమోదైంది. ఇటీవల చింతమనేని పినకడిమి శివారులో ఎడ్లబళ్లపై ఇసుక తీసుకువెళుతున్న దళితులను అడ్డుకుని ,వారిని కులం పేరుతో దూషించారని దళితులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇక ఇక్కడ దళితులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మద్దతునిచ్చారు. చింతమనేనిపై దళితులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టటంతో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ విచారణ చేపట్టారు.ఆ తరువాత చింతమనేనిని అరెస్ట్ చేశారు.
మద్యనిషేధానికి జగన్ స్ట్రాటజీ.. మందుబాబులను కంట్రోల్ చేసే నిర్ణయాలతో సర్కార్ బిజీ
ఇక దీంతో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. అయితే, చింతమనేని బెయిల్ పిటీషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. చింతమనేని రిమాండ్ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు. మరోవైపు ఇప్పటి వరకూ చింతమనేనిపై 51 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసుల వ్యవహారం జగన్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది.