జేసీ బ్రదర్స్ కు మరో సారి షాక్ : దివాకర్ ట్రావెల్స్పై మళ్ళీ ఆర్టీఏ కొరడా!!
నిన్నటివరకు అనంతపురం రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ కు అధికార వైసీపీ చుక్కలు చూపిస్తుంది .జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ నేతలకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. జేసీ బ్రదర్స్ ఆర్ధిక మూలాలపై వైసీపీ ప్రభుత్వం దెబ్బ కొడుతుంది. ఇటీవల జేసీ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు . ఇక తాజాగా మరోమారు దివాకర్ ట్రావెల్స్ ను టార్గెట్ చేసుకుని ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించటం అనంతపురంలో హాట్ టాపిక్ గా మారింది.
దివాకర్ ట్రావెల్స్ ను టార్గెట్ చేసిన ఆర్టీఏ అధికారులు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు నెలల క్రితం వరుసగా రెండు, మూడు సార్లు అధికంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం, అధిక ధరలు వసూలు చేయడం, స్టేజ్ కేరియర్లుగా తిప్పడం కారణాలుగా చూపి జేసీ బ్రదర్స్ కు సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు దివాకర్ ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేయడమే కాకుండా బస్సు పర్మిట్లను కూడా రద్దు చేశారు. ఇక తాజాగా మరోమారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఆరు బస్సులు సీజ్
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆరు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన బస్సులను అనంతపురం ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ బస్సులను సీజ్ చేస్తూ ఆర్ధిక మూలాల మీద కొడుతున్నారని జేసీ సోదరులు ఆరోపిస్తున్నారు. పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని, పార్టీ మారితే ఇలాంటి వేధింపులు ఉండవని జేసీ అనుయాయులు చెప్తున్న పరిస్థితి .
గతంలో సీజ్ చేసిన బస్సులను కోర్టు ద్వారా రిలీజ్ చేయించుకున్న జేసీ బ్రదర్స్
గతంలో కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు రెండు మూడు సార్లు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తమ బస్సులను అక్రమంగా సీజ్ చేశారంటూ జేసీ దివాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. సీజ్ చేసిన ట్రావెల్స్ బస్సులను రిలీజ్ చేయాలంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు మేరకు సీజ్ చేసిన బస్సులను అధికారులు రిలీజ్ చేశారు.
అప్పుడు సీజ్ చేసిన బస్సులే మరోమారు సీజ్ .. ట్రావెల్స్ యాజమాన్యం ఫైర్
అయితే గతంలో సీజ్ చేసి రిలీజ్ చేసిన బస్సులనే తాజాగా మరోసారి ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయంలో అధికారుల తీరుపై దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కక్షసాధింపుతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ వారు చెప్తున్నారు .ఇది కేవలం వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపే అని వారు అంటున్నారు.
ఆర్ధిక మూలాలే టార్గెట్ గా జేసీ సోదరులకి వరుస షాకులు
అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు వరకు జగన్ మీద నిప్పు చెరిగిన జేసీ బ్రదర్స్ ఎన్నికల తర్వాత నుండి సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఎందుకు కాంట్రవర్సి అన్నట్టు వివాదాలకు,వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ జేసీ బ్రదర్స్ ను టార్గెట్ చేసి కావాలనే ఆర్ధిక మూలాలపై దెబ్బ వేసినట్టు చర్చ జరుగుతుంది.