జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్ .. ఆ గ్రామంలో నిరసన సెగ .. కారణం ఇదే
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు స్థానికంగా నిరసన సెగ తగిలింది . ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీ నుండి బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్న నేతలు అయిన జేసీ బ్రదర్స్ కు ఇప్పుడు అక్కడ అంతా రివర్స్ జరుగుతుంది . తాడిపత్రి మండలం తలారి చెరువులో సోలార్ ప్రాజెక్టులో కార్మికుల తొలగింపు గురించి అక్కడకు వెళ్ళిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాడిపత్రి మండలం తలారీ చెరువు గ్రామానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళిన నేపధ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ గ్రామంలో ఉన్న సోలార్ ప్లాంట్లో పాత కార్మికులను తొలగించారంటూ అధికారులకు రెప్రజంటేషన్ ఇవ్వడానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జె.సి ప్రభాకర్ రెడ్డి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు..గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఆయన్ను అడ్డుకున్నారు. తమ పాలనలో చేసింది ఏమిటో చెప్పాలని నిలదీశారు . దీనిపై జేసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
గత టీడీపీ ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై ఈ సందర్భంగా స్థానికులు, వైసీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డిని నిలదీశారు.అధికారంలో ఉండగా కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని గ్రామస్తులు మండిపడ్డారు. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ..ప్లాంట్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు అంటూ కార్మికులను తొలగించారని వైసీపీ నాయకుడు రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. దీంతో ఇప్పుడు తాము కూడా తొలగిస్తున్నామంటూ చెప్పడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పుడు టీడీపీ చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు తాము చేసేది కరెక్ట్ అని వారు వాదానికి దిగారు .చివరకు అక్కడి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.