పవన్ కు షాకిచ్చిన మహిళా నేత .. బీజేపీలో చేరిక .. జనసేనపై షాకింగ్ కామెంట్స్
ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసింది. ఇక ఓటమి తరువాత ఇప్పుడిప్పుడే పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అయితే పార్టీ నుండి కొనసాగుతున్న వలసలు జనసేన పార్టీ నేతల్లో నిరాశను నింపుతున్నాయి. అంతేకాదు పార్టీ మారుతున్న వారు చేస్తున్న ఆరోపణలు జనసేన పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.
జనసేన పార్టీ ఓ విషపు చుక్క .. శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఓటమి బాధను అధిగమించి పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు .. షాకిస్తున్న వలస నేతలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓటమి పాలైన నేపథ్యంలో పార్టీ మనుగడ కష్టమని అందరూ భావించారు. తిరిగి పవన్ కళ్యాణ్ సినిమాలకు పరిమితమవుతారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ పుకార్లకు చెక్ పెడుతూ తన ఊపిరి ఉన్నంతవరకు జనసేన పార్టీని నడిపిస్తానని తేల్చిచెప్పారు. జనసేన పార్టీ ఒక మంచి విజన్ తో రాజకీయాల్లోకి వచ్చిందని ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల్లోకి వెళ్లిందని చెప్పిన పవన్ కళ్యాణ్ డబ్బు పంచితే తమ పార్టీ కూడా విజయం సాధించేదని ఇతర పార్టీల నేతలు ఓటమిపై చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అవరోధాలను అధిగమించి పార్టీని ముందుకు నడిపించడానికి, జనసేన కార్యకర్తల్లో, నేతల్లో ధైర్యం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకు వేస్తే, పదడుగులు వెనక్కు లాగినట్టుగా పార్టీలోని వలస వెళ్తున్న నేతల తీరు ఉంది.
జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన మహిళా నాయకురాలు .. బీజేపీలో చేరిక
జనసేన పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న నేతలు జనసేన పార్టీ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో చేరిన కొందరు నేతలు జనసేన పార్టీ ని వదిలి వేరే పార్టీలో చేరిపోయారు. రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ వంటి నేతలు జనసేన కు గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా జనసేన పార్టీ కి మరొక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. జనసేన పార్టీలో నిన్నటి వరకు పనిచేసిన మహిళా నాయకురాలు జనసేనకు షాక్ ఇచ్చారు. జనసేన పార్టీ మహిళా నాయకురాలు పుట్టి లక్ష్మీసామ్రాజ్యం జనసేన కు షాక్ ఇచ్చి బిజెపిలో చేరి పోయారు. బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలతో కలిసి లక్ష్మి సామ్రాజ్యం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు పార్టీ వీడిన లక్ష్మీ సామ్రాజ్యం జనసేన పార్టీ పైన తీవ్రమైన ఆరోపణలు చేసి అందరినీ షాక్ కి గురి చేశారు.
నిజాయితీగా పని చేసేవారికి జనసేన పార్టీలో స్థానం లేదన్న మహిళానేత లక్ష్మీ సామ్రాజ్యం
జనసేన మహిళా నాయకురాలు లక్ష్మి సామ్రాజ్యం ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామ్రాజ్యం గుంటూరు జిల్లా పెదకూరపాడు జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనను వీడి బిజెపిలో చేరిన ఆమె జనసేన పార్టీ కి సంబందించి జరుగుతున్న పరిణామాలు నచ్చకనే పార్టీ మారుతున్నానని చెప్పారు. ఎన్నికల సమయంలో సొంత పార్టీ నేతలే తనపై లేనిపోని దుష్ప్రచారాలు చేసి, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టారని ఆమె ఆరోపించారు. అసలు నిజాయితీగా పని చేసేవారికి జనసేన పార్టీలో స్థానం లేదని, పవన్ కళ్యాణ్ దగ్గర పెద్దగా గుర్తింపు ఉండదని ఆమె పేర్కొన్నారు. తొందర్లోనే జనసేన పార్టీకి చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరతారని తెలిపారు. జనసేన పార్టీ అవుతుందని ఆమె జోస్యం చెప్పారు.
జనసేన పార్టీని వీడుతున్న నేతలు అందరూ పార్టీ పైన ఆరోపణలు చేసి వెళ్లడం ఆనవాయితీగా మారింది. ఇక వీరి వ్యాఖ్యలతో జనసేన పార్టీ మరింత ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. అసలే డోలాయమాన స్థితిలో ఉన్న పార్టీని ఎలాగైనా ముందుకు నడిపించాలని పట్టుదలతో ఉన్న పవన్ కు, పార్టీని వీడుతున్న నేతలు మాటలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. రోజుకో రకంగా మారుతున్న పరిణామాలు ఒక్క అడుగు ముందుకు వేస్తే పవన్ ను పది అడుగులు వెనక్కి లాగుతున్నాయి.