పవన్ కళ్యాణ్ కు షాకిచ్చి: కొడాలి నానీతో ఎడ్లపందాలలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే రాపాక రాజధాని అమరావతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తో విబేధించారు. ఇక తాజాగా జనసేన విస్తృత స్థాయి సమావేశానికి కూడా హాజరు కాకుండా రాపాక సంక్రాంతి సంబరాల్లో అది కూడా వైసీపీ మంత్రి కొడాలి నానీతో కలిసి పాల్గొనటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
గుడివాడలో కొడాలి నానీతో కలిసి ఎడ్ల పందాలలో పాల్గొన్న రాపాక
కృష్ణా జిల్లా గుడివాడలో మూడు రోజుల ముందే సంక్రాంతి సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఇక సంక్రాంతి సందర్బంగా గుడివాడలో ఎడ్ల పందేలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. అయితే జనసేన కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ సమావేశానికి కూడా హాజరు కాకుండా శనివారం ఎడ్ల పందేల కార్యక్రమాన్ని మంత్రి కొడాలి నానితో కలిసి ప్రారంభించారు. గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పిన రాపాక వరప్రసాద్, తనను ఈ పోటీలకు ఆహ్వానించిన మంత్రి కొడాలి నానీకి ధన్యవాదాలు చెప్పారు.
సీఎం జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని కొనియాడిన రాపాక
రైతులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ సంక్రాంతి అని పేర్కొన్న ఆయన మరోమారు సీఎం జగన్ రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే పలుమార్లు ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సాహసం గొప్పదని ఆయన ఎడ్ల పందాల సందర్భంగా చెప్పారు .
ఎడ్ల పందాలకు రావటంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న రాపాక
కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్టీఆర్ టు వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన ప్రారంభించారు. అందరూ అనుకుంటున్నట్టు నాయకుడు పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య ఎటువంటి చర్చలు ఉండవు. ఇక్కడకు ఎడ్ల పందాలకు రావటంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రాపాక పేర్కొన్నారు. ఇక తన అభిప్రాయాలను తాను కచ్చితంగా చెప్తానన్న రాపాక రాజధాని రైతులు రోడ్డు మీద ధర్నాలు చేసే బదులు ముఖ్యమంత్రిని కలిస్తే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
జనసేనలో ఆ ఎమ్మెల్యే ఉండటం సందేహమే
ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతుల కోసం పోరాటం సాగిస్తానని చెప్తుంటే ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ ను కలిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పటం గమనార్హం. పార్టీలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పార్టీ తరపున వాయిస్ వినిపించాల్సింది పోయి వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చెయ్యటం , సీఎం జగన్ ను పొగుడ్తూ ఉండటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన జనసేనలో ఉండరు అనే విషయం స్పష్టమైంది.
జనసేనాని ఆలోచనలకూ భిన్నంగా ఎమ్మెల్యే రాపాక
ఇంగ్లీష్ విద్య తోపాటు మూడు రాజధానుల నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శిస్తే జనసేన ఎమ్మెల్యే సమర్ధించారు. అధినేత నిర్ణయాలకు వ్యతిరేకంగా రాపాక మాట్లాడుతుండటంతో జనసైనికులకు రాపాక తీరు ఏ మాత్రం నచ్చటం లేదు . ఆయనను సస్పెండ్ చేయాలనీ కూడా డిమాండ్ చేస్తున్నారు. జనసేన కూడా ఎమ్మెల్యే రాపాకకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అనుకుంది.. కానీ ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. మొత్తానికి జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేనానికి పెద్ద తలనొప్పిగా మారారు. పార్టీలో ఉంటూనే పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారు.