సుజనా చౌదరికి షాక్: రుణాలు చెల్లించకపోవడంతో ఆస్తుల వేలంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసులు
Recommended Video
హైదరాబాదు: మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి సంబంధించిన సుజనా గ్రూప్ రూ.400 కోట్లు రుణంగా తీసుకుని ఎగవేసినందున లోన్ డీఫాల్ట్ కిందకు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా సుజనా గ్రూప్నకు సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు నోటీసులు ఇచ్చింది. ఇది సర్ఫేసీ(SARFAESI) చట్టం 2002 కింద బ్యాంకు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను రుణాలు తీసుకున్నవారికి, గ్యారెంటీ ఇచ్చినవారికి జారీ చేసింది.
మార్చి 23న ఆన్లైన్లో సుజనా గ్రూప్ ఆస్తుల వేలం
సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించనందున ఆ సంస్థను డీఫాల్టర్ కింద గుర్తిస్తూ ఆస్తులను ఆన్లైన్ ద్వారా వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసుల్లో పేర్కొంది. మార్చి 23న ఆన్లైన్ ద్వారా వేలం వేయడం జరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసుల్లో పేర్కొంది. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ ఆన్లైన్ వేలం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక బిడ్డింగ్లో పాల్గొనాలనుకునే వారు మార్చి 21వ తేదీలోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. మార్చి 20న అధికారులు సుజనా గ్రూప్ ఆస్తులను పరిశీలిస్తారని తెలిపింది.
వీరికి నోటీసులు పంపిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
సుజనా గ్రూప్నకు సంబంధించి సుజనా క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, సుజనా పంప్స్ మరియు మోటార్స్, న్యూఆన్ టవర్స్ ఒకప్పుడు సుజనా టవర్స్, ఇంకా గ్యారెంటర్లపేర్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసుల్లో పేర్కొంది. ఇక రుణం తీసుకునే సమయంలో గ్యారెంటీ సంతకాలు చేసిన శివలింగ ప్రసాద్(మరణించారు) వై జితిన్ కుమార్, వై శివరామకృష్ణ, ఎస్టీ ప్రసాద్, గొట్టుముక్కల శ్రీనివాస్ రాజు, సార్క్ నెట్ లిమిటెడ్లతో పాటు 11 గ్యారెంటర్ల పేర్లను నోటీసుల్లో ప్రస్తావించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. పంజాగుట్టలోని సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల జాబితాలో నమోదై ఉండటం విశేషం.
రూ.5700 కోట్లు మనీలాండరింగ్..?
సుజనా చౌదరి రూ.5700 కోట్ల మేరా మనీలాండరింగ్కు పాల్పడినట్లు 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఆరోపణలు చేసింది. సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేసి మనీలాండరింగ్కు పాల్పడ్డారంటూ 2019 డిసెంబర్లో వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన లేఖ కూడా రాశారు. సుజనా యూనివర్శల్ మరియు సుజనా టవర్స్ కలిపి బ్యాంకులకు రూ. 920 కోట్లు టోకరా వేసినట్లు విజయ్ సాయిరెడ్డి ఆరోపించారు. టోకరా వేసిన బ్యాంకుల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి కాగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండోదని చెప్పారు.
విజయ్ సాయిరెడ్డి లేఖలో ఏం చెప్పారు..?
2011 నుంచి 2014 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.565 కోట్లు ఉన్న సుజనా టవర్స్ అప్పులు రూ.1750 కోట్లకు పెరిగాయన్నారు. ఇక రూ. 1534 కోట్లుగా ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37 కోట్లకు పడిపోయిందని గుర్తుచేశారు. సుజనా గ్రూప్ వివిధ బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు రూ. 8వేల కోట్లు బకాయి పడిందని లేఖలో రాశారు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన వాటాదారులు భారీగా నష్టపోయారని లేఖలో రాశారు విజయ్ సాయిరెడ్డి.