మండలి చైర్మన్ కు, టీడీపీకి షాక్ .. సెలెక్ట్ కమిటీ ఫైల్ వెనక్కు ... వాట్ నెక్స్ట్ ?
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం మేరకు వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లను మండలి కార్యాలయానికి పంపి కమిటీ ఏర్పాటు చెయ్యాలని ఛైర్మన్ షరీఫ్ ఫైల్ పంపించారు . కమిటీల ఏర్పాటు ఫైల్ను మండలి చైర్మన్కు శాసనమండలి కార్యాలయం తిరిగి పంపింది. దీంతో టీడీపీ కి ముఖ్యంగా షాక్ తగిలినట్టు అయ్యింది.
శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో కొత్త మలుపు .. అధికార పక్షానికి షాక్ ఇచ్చిన విపక్షాలు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో వెనకడుగు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో వెనకడుగు పడింది . రూల్ 154 కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఫైల్ మీద రాసి మండలి కార్యాలయ కార్యదర్శి తిప్పి పంపినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ తరువాత స్టెప్ వెయ్యటానికి ప్రయత్నం చేస్తుంది. ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ మరియు సిఆర్డిఎ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయడం కొత్త మలుపు తీసుకుంది. మొదట నుండే అధికార పార్టీ సెలెక్ట్ కమిటీల ఏర్పాటు చెల్లదని, రూల్ కు వ్యతిరేకం అని చెప్తున్న క్రమంలో ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని తేల్చి చెప్పారు. మండలి కార్యదర్శికి సైతం లేఖలు సైతం రాశారు.
మళ్ళీ చైర్మన్ వద్దకు చేరిన సెలెక్ట్ కమిటీ ఫైల్
ఇక రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఏపీ శాసనమండలిలో చర్చల నేపథ్యంలో సెలెక్ట్ కమిటీ కోసం మండలి ఛైర్మన్ షరీఫ్కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పేర్లు ఇచ్చాయి.ఇక ఈ ఫైల్ ను శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపింది. దీంతో మళ్లీ శానసమండలి చైర్మన్ వద్దకు ఫైలు చేరింది.ఇక దీంతో శాసనమండలి కార్యదర్శిని ఏపీలోని శాసనమండలి సభ్యులు ఉన్న ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ లు కలిశాయి.
మండలి కార్యదర్శిని సెలెక్ట్ కమిటీపై చైర్మన్ ఆదేశాలు పాటించాలని కోరిన విపక్షాలు
రూల్ 154 కింద చైర్మన్ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే కమిటీ వేయాల్సి ఉంటుందని విపక్షాలు మండల కార్యదర్శికి తెలియజేశాయి . సెలక్ట్ కమిటీని తక్షణం వేయాలని, దానికి సంబంధించి ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శిని కోరారు.మళ్ళీ చైర్మన్ నుంచి ఫైలు వచ్చిన వెంటనే కమిటీ వేయని పక్షంలో ఈ సారి మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని కూడా టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
వైసీపీ భయంతో కార్యదర్శిని బెదిరించి ఫైల్ వెనక్కు పంపిందని ఆరోపణ
సెలక్ట్ కమిటీ అంటే ప్రభుత్వం భయపడుతుంది అని అందుకే మండలి సెక్రటరీని బెదిరించి సెలక్ట్ కమిటీ ఫైల్ను వెనక్కి పంపేలా చేశారని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపణలు గుప్పిస్తున్నారు . సీఆర్డీయే రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళితే బిల్లు పరిస్థితి అంధకారంలో పడుతుందనే ఉద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కానీ ప్రభుత్వం మాత్రం సెలెక్ట్ కమిటీ ఏర్పాటే రూల్స్ కు విరుద్ధం అని చెప్తుంది.
మండలి ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం
ఇక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చెయ్యకుండా ఫైల్ వెనక్కు పంపించిన నేపధ్యంలో టీడీపీ మరోమారు సెలెక్ట్ కమిటీ ఫైల్ మండలి కార్యదర్శికి పంపాలని, అప్పుడు కూడా వెనక్కు పంపితే మండలి ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని భావిస్తుంది. మరి ఈ నేపధ్యంలో టీడీపీ ప్లాన్ కు సర్కార్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.