టీడీపీకి షాక్ .. వైసీపీలో చేరనున్న కడప జిల్లా కీలక నేత
ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణం గా తయారవుతుంది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడి వెళ్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అసలే ఆగస్టు మాసం వస్తోందంటే ఎలాంటి సంక్షోభాన్ని చూడాల్సి వస్తుందో అన్న భయం లో ఉన్న టిడిపికి ఇప్పుడు కీలక నేతలు ఒక్కరొక్కరుగా షాక్ ఇవ్వనున్నారు. వైసీపీకి కంచుకోట అయిన కడప జిల్లాలో టిడిపిని కాపాడుతూ పనిచేసిన ఓ కీలక నేత పార్టీ వీడి వైసీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ఇబ్బందుల్లో టీడీపీ .. ఐదేళ్ళ పాటు టీడీపీకి కష్టాలే
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. వైసీపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది . కేవలం 23 సీట్లతో టిడిపి రాష్ట్రంలోని అధికార పార్టీని, కేంద్రంలోని అధికార పార్టీని తట్టుకొని నిలబడడం స్పష్టంగా కనబడుతుంది. ఒకపక్క వైసిపి, మరోపక్క బిజెపి మూకుమ్మడిగా దాడి చేస్తుంటే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదనే భావన కలుగుతుంది.
ఆగస్టు దగ్గర పడుతుంటే టీడీపీలో ఆందోళన .. కడపజిల్లా కీలకనేత పార్టీకి రాజీనామా
ఇప్పటికే టీడీపీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే నలుగురు రాజ్యసభ సభ్యులు మరియి కొందరు సీనియర్ నేతలు టీడీపీనీ వీడి బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆషాడం తర్వాత వచ్చే నెలలో అంటే ఆగస్టులో భారీగా వలసలు ఉంటాయని బిజెపి నేతలు చెబుతున్నారు. అన్ని పార్టీల నుండి బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి చాలామంది ఆసక్తితో ఉన్నారని చెప్తున్నారు. అయితే వలసలు ఆపడానికి టీడీపీ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పార్టీనీ వీడే వారు మాత్రం ఆగడంలేదు.
ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కడప జిల్లా టీడీపీకి చెందిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయారని టాక్ వినిపిస్తోంది.
వైసీపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ... కడపలో వలసలు షురూ
వైయస్సార్సీపి కంచుకోట అయిన కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం వీరశివారెడ్డి చాలా కష్టపడ్డారు. గత ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందని ఆశపడ్డారు. అయితే ఈ సారి ఎన్నికలలో ఈయనకు టీడీపీ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్న ఈయన వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి సమక్షంలో త్వరలోనే వైసీపీలో చేరతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తే ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. కానీ టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారించిన వీరశివారెడ్డి ఇక టీడీపీలో తన మనుగడ కష్టమనుకుని వైసీపీలో చేరాడానికి రెడీ అయిపోయారు. అయితే జిల్లా నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీనీ వీడి వైసీపీలో చేరుతున్న మొదటి నేత వీరశివారెడ్డి . ఇక వీరశివారెడ్డి బాటలో కడప జిల్లా నుండి ఇంకెంత మంది టీడీపీ నేతలు వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారో అన్న టెన్షన్ టిడిపిని ఇబ్బందిపెడుతోంది. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ బాట పట్టిన వీరశివారెడ్డి ఇచ్చిన షాక్ టిడిపికి మామూలు షాక్ కాదు.