టీడీపీకి షాక్ ... ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యే ఛాన్స్...టచ్ లో వైసీపీ మంత్రులు
ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అలాగే కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలలో ఒక్క కరణం బలరాం మినహాయించి మిగతా ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. స్థానిక నేతలతో , అనుయాయులతో సమావేశం నిర్వహిస్తున్న వీరు త్వరలో పార్టీకి షాక్ ఇస్తారని ప్రకాశం జిల్లాలో చర్చ జరుగుతుంది.
తిరుమలలో మత మార్పిడులు.. ముఖ్యమంత్రికి తెలియవా? పవన్ కల్యాణ్ ఫైర్
ప్రకాశం జిల్లాలో టీడీపీకి షాక్ ఇవ్వనున్న ముగ్గురు ఎమ్మెల్యేలు
ప్రకాశం జిల్లాలో అద్దంకి నుంచి విజయకేతనం ఎగురవేసిన గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అలాగే కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని పార్టీ మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు, మంత్రులు . గత రెండు నెలలుగా వారికి టచ్ లో ఉన్న వైసీపీ నేతలు , మంత్రులు వారిని వైసీపీ లో చేరాలని కోరుతున్నారు. అలా వచ్చిన వారికి నియోజక వర్గ ఇంచార్జ్ గా అవకాశం ఇస్తామని కూడా హామీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగి టీడీపీ ఎమ్మెల్యేలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలకు టచ్ లో వైసీపీ మంత్రులు , ముఖ్య నేతలు
ఇక పార్టీ మార్పు విషయంలో సానుకూలత వ్యక్తం చేస్తే ఓకే.. లేదంటే వారిని ఇబ్బందులు పెట్టటానికి కూడా వైసీపీ నేతలు వెనకాడటం లేదని ప్రకాశం జిల్లాలో చర్చ జరుగుతుంది. అందుకు ఉదాహరణే అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కు అడుగడుగునా ఎదురవుతున్న ఇబ్బంది. అద్దంకి నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి విజయకేతనం ఎగురవేశాడు గొట్టిపాటి రవికుమార్.
టీడీపీ ఎమ్మెల్యేలకు తిప్పలు .. గొట్టిపాటికి విజిలెన్స్ దాడుల సెగ
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో గొట్టిపాటికి కష్టాలు మొదలయ్యాయి. గొట్టిపాటి రవికుమార్ కు అద్దంకి నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారం ఉంది . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విజిలెన్స్ దాడులతో గొట్టిపాటి రవికుమార్ కు సంబంధించిన బల్లికురవ, చీమకుర్తిలో ఉన్న గ్రానైట్ వ్యాపారం నిలిచిపోయింది. అప్పటినుండి వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవికుమార్ ఇదే విషయాన్ని చంద్రబాబు తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
కరణం బలరాం తో కూడా టచ్ లో ఉన్న వైసీపీ నేతలు
అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో తాజాగా ఆయన టిడిపికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని చూస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది.ఇక గొట్టిపాటితో పాటు కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా ముఖ్య అనుచరులతో పార్టీ మార్పుపై మంతనాలు చేస్తున్నారు. వీరు సైతం అధికార పార్టీలో లేకుంటే వేధింపులు ఉంటాయని, నియోజకవర్గంలో పని చెయ్యలేమని ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది. ఒక పక్క వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తో కూడా టచ్ లో ఉన్నట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది.
పార్టీ మార్పు ప్రచారంతో రంగంలోకి చంద్రబాబు .. టీడీపీకి షాక్
ఇక ప్రకాశం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినట్టు సమాచారం .ఆయన ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి వారికి స్థానికంగా ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పార్టీ అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇస్తున్నారు. ఎలాంటి సందర్భంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన ఎమ్మెల్యేలను కోరుతున్నట్టు సమాచారం .
రాజకీయ భవిష్యత్ మీద స్పష్టమైన హామీ వస్తే ముగ్గురు జంప్ అయ్యే ఛాన్స్
సీఎం జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే , వారి రాజకీయ భవిష్యత్ మీద స్పష్టమైన హామీ వస్తే మంచి రోజు చూసుకుని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉంది.ఒకవేళ అదే గనుక జరిగి ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వెళితే టీడీపీకి, చంద్రబాబుకు ప్రకాశం జిల్లాలో మరో ఊహించని షాక్ తగిలినట్టే అవుతుంది. ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న వేళ ఇది టీడీపీకి తీరని నష్టం చేస్తుంది.