వల్లభనేని వంశీకి షాక్ .. హై కోర్ట్ లో ఆయన ఎన్నిక చెల్లదని వైసీపీ పిటీషన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీ కేవలం 23 మంది సీట్లను మాత్రమే దక్కించుకుంది. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీకి , టీడీపీ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇస్తున్నారు వైసీపీ నేతలు . ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు పై అనర్హత వేటు వెయ్యాలని , వారి ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, వల్లభనేని వంశీకి కూడా షాక్ ఇచ్చారు వైసీపీ నేత వెంకటరావు .
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి పిటీషన్
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి పిటీషన్ దాఖలు చేయడం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది . ఇప్పటికే నలుగురి మీద కోర్టులో పిటీషన్ దాఖలు కాగా ఇప్పుడు ఐదో ఎమ్మెల్యే మీద కూడా పిటీషన్ దాఖలైంది . కృష్ణాజిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం ఎన్నికల పిటిషన్ దాఖలైంది. గన్నవరం నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి వై.వెంకటరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని , పోస్టల్ బ్యాలెట్ మరోమారు లెక్కించాలని పిటీషన్
ఎన్నికల సమయంలో ఏ మాత్రం అవకతవకలు ఉన్నట్టు ఆధారాలున్నా, లేదా వారు అఫిడవిట్ లో సమర్పించిన వివరాలు సమగ్రంగా లేవని గుర్తించినా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు వైసీపీ నేతలు . ఇక వల్లభనేని వంశీ విషయంలో ఎన్నికల ప్రచార సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను వంశీ ఉల్లంఘించారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి వంశీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు . ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే వంశీ సూచనతో ఆయన అనుచరులు పాత తహశీల్దార్ సంతకంతో ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారని , ఇవి నకిలీవని తెలుసుకున్న కొందరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారని వెంకటరావు తన పిటీషన్లో తెలిపారు. అంతేకాదు పోస్టల్ బ్యాలెట్లను మరోసారి లెక్కించేలా ఆదేశించాలని వెంకటరావు అభ్యర్థించారు.
టెన్షన్ లో టీడీపీ ఎమ్మెల్యేలు .. ఇంకా ఎంత మందిపై పిటీషన్లు వేసి ఇబ్బంది పెడతారో ?
అసలే పార్టీని , క్యాడర్ ను ఎలా కాపాడుకోవాలి అని దిక్కుతోచని స్థితిలో ఉన్న టీడీపీ నాయకులకు గోరు చుట్టు మీద రోకటి పోటు అన్న చందంగా ఎన్నిక విషయంలో కోర్టులో కేసుల మీద కేసులు పడుతుండటంతో టెన్షన్ కు గురవుతున్నారు. అన్ని వైపుల నుండి జరుగుతున్న ఈ దాడికి టీడీపీ సందిగ్ధంలో పడుతుంది. తాజా పరిస్థితి చూస్తే ఇంకా ఎంత మంది మీద కేసులు పడనున్నాయో అన్న భావన వ్యక్తమవుతుంది.