హైకోర్టులో రోజా, ఇతర వైసిపి ఎమ్మెల్యేలకు షాక్, పిల్ కొట్టివేత
హైదరాబాద్: వైసిపి ఎమ్మెల్యేలకు గురువారం నాడు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీల్లో తమకు చోటు కల్పించడం లేదని పలువురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిల్ను హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ పి నవీన్ రావులతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
ఇటీవల కోర్టుల్లో వైసిపికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే రోజా వ్యవహారంలో వైసిపి సుప్రీం కోర్టు దాకా వెళ్లి దెబ్బతిన్నది. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కమిటీల్లో తమకు చోటు కల్పించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలన్న ఆ పార్టీ ఎమ్మెల్యేల వాదనలను హైకోర్టు కొట్టివేసింది.
ఈ విషయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ వినిపించిన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేసింది.
అప్పటిదాకా ఆసుపత్రి అభివృద్ధి కమిటీల్లో ఎమ్మెల్యేలకు సభ్యత్వం ఉండగా, చంద్రబాబు సర్కారు దానిని రద్దు చేస్తూ జీవో జారీ చేసిందని వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేయాలని కోర్టును కోరారు.
ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రజా ప్రతినిధులు తమ బిజీ షెడ్యూల్ కారణంగా ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ సమావేశాలకు హాజరుకాలేరని, ఈ కారణంగా పలు కార్యక్రమాలు ఆసల్యమవుతాయన్న భావనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయం ఒక్క విపక్ష ఎమ్మెల్యేలనే కాకుండా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కూడా సదరు కమిటీలకు దూరంగా ఉంచిందన్నారు. దీంతో కోర్టు వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టేసింది. కాగా, పిటిషన్దారుల్లో ఒకరైన ఆదినారాయణ రెడ్డి కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు.