షాకింగ్:మహిళా కండక్టర్లకు బ్రీత్ అనలైజింగ్ పరీక్షలు;ఆర్టీసీ ఎండీ వివరణ
అమరావతి:ఆర్టీసి మహిళా కండక్టర్లకు మద్యం ఎంత సేవించారనే స్థాయిని నిర్థారించే బ్రీత్ అనలైజింగ్ పరీక్షలు నిర్వహించిన సంఘటన ఎపిఎస్ ఆర్టీసీలో కలకలం సృష్టించింది. విశాఖపట్నం జిల్లా సింహాచలం డిపోలో శనివారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈ ఘటన ఎపిఎస్ ఆర్టీసీలో సంచలనం సృష్టించడంతో ఆర్టీసి ఎమ్డి ఎన్వి సురేంద్రబాబు ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. పురుషులతో పాటుగా మహిళా కండక్టర్లకు బ్రీత్ అనలైజింగ్ పరీక్షలు నిర్వహించాలన్న సాధారణ సూచనల మేరకు సింహాచలం డిపోలో పరీక్షలు నిర్వహించామని, అక్కడి భద్రతా సిబ్బంది అత్యుత్సాహం వల్లే మహిళా కండక్టర్లకు కూడా పరీక్షలు నిర్వహించారని ఆర్టీసి ఎమ్డి ఎన్వి సురేంద్రబాబు చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...
విశాఖపట్నం జిల్లా సింహాచలం డిపోలో భద్రతా సిబ్బంది అత్యుత్సాహంతో ఏకంగా డ్యూటీలో ఉన్న నలుగురు మహిళా కండక్టర్లకు బ్రీత్ అనలైజింగ్ పరీక్షలు నిర్వహించిన ఘటన పెనుప్రకంపనలు రేపింది. ఈ ఘటన ఆలస్యంగా బైటకు పొక్కినా చివరకు ఆర్టీసి ఎమ్డి సురేంద్రబాబుకు ఈ వివాదం గురించి తెలియడంతో ఆయన డిపో మేనేజర్ ను ఆరా తీసినట్లు తెలిసింది.
ఆ పరీక్షలు నిర్వహించిన భద్రతా సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తొలుత ఎండి ఆదేశించినట్టు సమాచారం. మరో వైపు భద్రతా సిబ్బంది మహిళా కండక్టర్లకు ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనపై ఆర్టీసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కండక్టర్లకు బ్రెత్ అనలైజింగ్ పరీక్షలు నిర్వహించాన్న ఆదేశాలు ఎక్కడా లేవని పేర్కొంది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మహిళా కండక్టర్లకు ఈ పరీక్షలు నిర్వహించరాదని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేసింది.
మహిళా కండక్టర్లకు బ్రీత్ అనలైజింగ్ పరీక్షలపై దుమారం రేగడంతో ఈ వివాదంపై ఆదివారం ఆర్టీసి ఎమ్డి ఎన్వి సురేంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా సిబ్బందికి ఈ పరీక్షలు నిర్వహించడం దురదృష్టకరమని, ఇది ఏ మాత్రం సమంజసం, సమర్థనీయం కాదని ఆయన తెలిపారు. సంబంధిత అధికారుల ద్వారా ఘటన వివరాలు తెలుసుకున్నానని, ఇప్పటికైనా సిబ్బంది తప్పు తెలుసుకోవాలని సూచించామన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసు కుంటామన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది తమ తప్పును సరిదిద్దుకునేందుకు ఒకటి, రెండు అవకాశాలివ్వాలని, అటు తర్వాతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే సముచితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై సదరు భద్రతా సిబ్బంది పశ్చాత్తాపపడుతూ వీడియో మెసేజ్ ద్వారా క్షమాపణలు తెలిపారన్నారు.