కలకలం:తిరుమల ఎస్వీ యూనివర్శిటీలో చిరుత సంచారంతో విద్యార్థుల బెంబేలు
తిరుపతి: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం వార్తలపై కలకలం రేగింది. విశ్వవిద్యాలయం ఆడిటోరియం పక్కన రెండు లేగదూడలు విగతజీవులై పడి ఉండటం...వాటిపై ఏదో జంతువు దాడి తాలుకూ గుర్తులు ఉండటంతో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆడిటోరియం పక్కన లేగదూడలు నిర్జీవంగా పడి ఉండటాన్ని విద్యార్థులు ఆదివారం వేకువఝామున గుర్తించారు. దీంతో ఈ సమాచారం వెనువెంటనే దానావలం లా యూనివర్సీటీ అంతటా వ్యాపించడంతో విద్యార్థులు భయభ్రాంతులకు లోనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు.
చిరుత...పంజా గుర్తులేనా?
మృతి చెందిన దూడల శరీరాలపై చిరుత పంజా వంటి గుర్తులు ఉండటం...ఆ పక్కనే రహదారిపై రక్తంతో తడిసిన కాలి ముద్రలు చిరుతని పోలి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోలన చెందుతున్నారు. అనంతరం అధికారులు అటవీ శాఖా అధికారులకు సమాచారం అందిచటంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు అవి చిరుత దాడి తాలూకు ఆనవాళ్లు కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నట్లుగా తెలిసింది.
చిరుతేనా...లేక మరో జంతువా?
ఈ దాడి జరిపింది చిరుతేనా లేక మరో జంతువా అనే కోణంలో విచారణ సాగిస్తూనే మరోవైపు ఆ జంతువు ఆచూకి కోసం అటవీశాఖ అధికారులు శోధిస్తున్నారు. మరోవైపు అడవి నుంచి వస్తున్న ఒక చిరుత పులి కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. స్థానికుల ఆందోళన నేపథ్యంలో యూనివర్శిటీ , అటవీ శాఖ అధికారులు అప్రమప్తమయ్యారు.
ముమ్మరంగా... ప్రయత్నాలు
యూనివర్శిటీలో జీవాలపై దాడి చేసింది చిరుతైనా , మరో జంతువైనా వీలైనంత త్వరగా దాన్ని పట్టుకోవాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు. విశ్వవిద్యాలయం లో విద్యార్థుల భద్రత దృష్ట్యా అది అత్యంత ఆవశ్యమని వారు భావిస్తున్నారు. అటవీ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉమ్మడి సహకారంతో చిరుతను బంధించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలోనూ...ఆందోళన
అయితే గతంలో ఇలాగే తిరుపతి కపిలేశ్వరాలయ సమీపంలో తల్లి, పిల్ల చిరుతలు రెండూ సంచరిస్తున్నాయని ఫారెస్టు అధికారులకు సమాచారం రావడంతో వాటిని బంధించేందుకు ప్రత్యేకంగా రెండు బోన్లను ఏర్పాటు చేశారు. అందులో చిరుతలను పట్టుకునేందుకు ఎరగా రెండు కుక్కలను ఉంచారు. ఆ క్రమంలో అటవీ శాఖాధికారులు ఏర్పాటు చేసిన బోన్లో ఉదయం ఒక చిరుత పిల్ల చిక్కింది. అయితే చిరుతను పట్టుకునేందుకు కుక్కలను ఉంచడంపై అధికారులు కుక్కలను ఉంచడంపై జంతు ప్రేమికుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అధికారులు తాజా వ్యవహారంలో ఆచితూచి అడుగువేస్తున్నారు.