కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్ మాయం...ఏవోబీలో కూంబింగ్ కు తాత్కాలిక విరామం
విజయనగరం:విజయనగరంలో ఒక కానిస్టేబుల్ కు సంబంధించిన ఏకే 47 రైఫిల్ మాయం కావటం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ఒడిసాకు ఎన్నికల సామగ్రిని తీసుకువెళ్తున్న వాహనానికి భద్రత కల్పిస్తున్న ఒక కానిస్టేబుల్ రైఫిల్ అనూహ్యంగా మాయమైంది.
మరోవైపు ఆంధ్రా, ఒడిసా సరిహద్దు ప్రాంతంలో ఈ రెండు రాష్ట్రాల పోలీసుల జాయింట్ సెర్చింగ్ ఆపరేషన్కు తాత్కాలిక విరామం ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భద్రతా దళాలకు సమాచారం పంపగా శనివారం నుంచి పోలీసు బలగాలు వెనుదిరిగినట్లు సమాచారం. ఇటీవల జరిగిన అరకు దాడి నేపథ్యంలో రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు ఏవోబీని జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నుంచి ఒడిసాకు ఎన్నికల సామగ్రిని తీసుకువెళ్తున్న వాహనాన్ని విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస టోల్గేట్ వద్ద శనివారం తెల్లవారుఝామున 2 గంటల సమయంలో భద్రత సిబ్బంది విశ్రాంతి కోసమని ఆపారు. తిరిగి 4 గంటలకు వాహనం బయలుదేరే సమయంలో సాహు అనే కానిస్టేబుల్ తన ఏకే 47 రైఫిల్ మాయమైనట్లు గుర్తించాడు.
ఆ విషయాన్ని తోటి భద్రతా సిబ్బందికి చెప్పగా వారంతా కంగారు పడి ఆ ఏకే 47 రైఫిల్ కోసం వాహనం, చుట్టుపక్కల అంతా వెతికారు. రైఫిల్ ను తన బ్యాగులోనే భద్రపరిచానని, అది ఎలా పోయిందో అర్థం కావడం లేదని సాహు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం అతడు గన్ పోయినట్లు డెంకాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఏవోబీలో ఆంధ్ర,ఒడిషా రాష్ట్రాల పోలీసులు తమ జాయింట్ ఆపరేషన్కు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఇటీవల అరకు సమీపంలోని లివిటిపుట్టు వద్ద ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన నేపథ్యంలో రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు వారం రోజులుగా సరిహద్దు ప్రాంతాలను కూంబింగ్ తో జల్లెడ పడుతున్నాయి.
నిర్విరామంగా గాలింపులు జరుపుతూ భద్రతా దళాలు అలసిపోయాయని సమాచారం రావడంతో జాయింట్ ఆపరేషన్ కు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించి ఆ మేరకు వారికి సమాచారం పంపించారు. దీంతో కూంబింగ్లో పాల్గొన్న ఆంధ్రాకు చెందిన స్పెషల్పార్టీ, గ్రైహౌండ్స్, ఒడిసాకు చెందిన బీఎస్ఎఫ్, ఎస్వోజీ పోలీసు బలగాలు దపదఫాలుగా వారివారి ప్రాంతాల్లో బేస్ క్యాంప్లకు చేరుకుంటున్నాయని తెలిసింది.