షాకింగ్ : ఏపీలో డేంజర్ బెల్స్.. తేల్చిన జలవనరుల శాఖ
దేశంలో కరువు విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏపీలో ఈ పరిస్థితి మరీ ప్రమాదకరంగా పరిణమించింది. రాష్ట్రంలోని నదులు, చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భ జలాలపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. జలవనరుల శాఖ తేల్చి చెప్పిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సగటున 600 టీఎంసీలుగా ఉండాల్సిన భూగర్భ నీటి మట్టం ఇప్పుడు 100 టీఎంసీలకు పడిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
కరువుకు మారుపేరుగా చెప్పుకునే అనంతపురంలొ అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జిల్లాలోని కొన్ని చోట్ల వెయ్యి అడుగుల దిగువన కూడా భూగర్భ నీరు లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగించే అంశం. సగటున చూసుకుంటే జిల్లాలో భూగర్భ జలాలు 20 మీటర్ల దిగువనే లభ్యమవుతున్న పరిస్థితి. ప్రకాశం, పశ్చిమ గోదావరిలోను ఇదే పరిస్థితి ఉందంటే భూగర్భ జలాల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సంవత్సరం కూడా రుతుపవనాలు సకాలంలో రాకపోయినా..! సరైన వర్షపాతం నమోదు కాకపోయినా..! ఏపీ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణాతో పాటు పెన్నా, నాగవళి, వంశధార, జంజావతి, తమ్మిలేరు, బుడమేరు, గుండ్లకమ్మ, స్వర్ణముఖి నదులు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. మరి ఈ ఏడైనా వరుణుడు కరుణించి కరువును దూరం చేస్తాడో.. లేదో.. వేచి చూడాలి.