సంచలనం:సిఎం చంద్రబాబు నివాసంపై...అనుమానాస్పద మహిళ నిఘా
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద గుర్తుతెలియని మహిళ సంచారం కలకలం సృష్టించింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఈ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకోవడానికి ముందు తనను ప్రశ్నించిన భద్రతా సిబ్బందికి తాను సచివాలయం వద్దకు వెళుతున్నానని సమాధానం చెప్పిన ఈ మహిళ ఎంత సమయం గడచినా అక్కడక్కడే తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెని వివరాలు అడిగారు. అయితే ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద తచ్చాడుతుండటంపై మహిళను పోలీసులు వివరాలు అడుగగా...ఓసారి తాను సీబీఐ అధికారినని, మరోసారి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ భార్యనంటూ పొంతనలేని సమాధానమిచ్చినట్లు తెలిసింది.
దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆధారాలు పరిశీలించారు. ఆమె దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్డులో ఆమె పేరు ఎ.ఎర్విన్ రీటా అని, ఆమె స్పెషల్ సిబిఐ జాయింట్ ఇంటర్నేషనల్ హోదాలో పనిచేస్తున్నట్లుగా ఉండటంతో...విచారణ కోసం పోలీసులు ఆమెను తాడేపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.
చంద్రబాబుకు మావోయిస్టుల నుండి హెచ్చరికలందుతున్న నేపథ్యంలో మహిళను ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే సిఎం చంద్రబాబు నివాసం వద్ద భద్రతను పెంచారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ పై త్వరలో సిబిఐ విచారణ జరుగుతుందనే ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు సిఎం చంద్రబాబు నివాసం వద్ద అనుమానాస్పద మహిళ సంచారం టిడిపి శ్రేణుల్లో ఆందోళన రేపింది. ఆ మహిళ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా విచారణ జరపాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి. మరోవైపు ఆ మహిళకు మతిస్థిమితం లేదని స్థానికులు కొందరు చెబుతున్నట్లు తెలిసింది.