వైజాగ్ దివ్య హత్యకేసులో కొత్త కోణాలు .. భర్తే దివ్యను అమ్మేసి వ్యభిచార కూపంలో నెట్టాడా?
విశాఖలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 3వ తేదీన దారుణ హత్యకు గురైన దివ్య కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు దివ్య జీవితంలోని చీకటి కోణాలను బయటకు తీస్తున్నారు.ఇక ఈ హత్యకేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఈ కేసులో దివ్య భర్త ఆమె వ్యభిచారం చేయడానికి వసంత గ్యాంగ్ కు అమ్మేశాడు అని ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. దివ్య భర్త కోసం గాలింపు చేపట్టారు.
వ్యభిచారంలో పోటీనే హత్యకు కారణం ? ఆమె అందమే శాపం .. దివ్య హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్ లు
ఇప్పటికే దివ్య కేసులో ఆరుగురు రిమాండ్
విశాఖలోని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దివ్య హత్య ఘటన రోజుకొక కొత్త మలుపులు తిరుగుతోంది.ఇప్పటికే ఈ హత్య కేసులో ఐదుగురు మహిళలు ఒక యువకుడు సహా ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ప్రస్తుతం వీరంతా రిమాండ్ లో వున్నారు. తదుపరి విచారణ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేసి వీరిని కష్టడీకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. అప్పుడే దివ్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
వ్యభిచార రొంపిలోకి దింపిన వసంతనే ప్రధాన నిందితురాలు
ఎవరూ ఊహించని విధంగా అత్యంత దారుణంగా దివ్య హత్య జరిగింది. వ్యభిచారంలో పోటీనే, అందంగా ఉండడమే దివ్య పాలిట శాపంగా మారింది. దివ్య శరీరంపై 33 వాతలు పెట్టి మూడు రోజుల పాటు నీరు,ఆహారం లేకుండా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు వ్యభిచార మాఫియా . దివ్యకు ఆశ్రయం కల్పించి వ్యభిచార రొంపిలోకి దింపిన వసంత, ఆమె కుటుంబ సభ్యులే దివ్య మరణానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.
తాజాగా వెలుగులోకి మరో ముగ్గురి పేర్లు
ఇక ఈ కేసులో తాజాగా మరో ముగ్గురు అనుమానితుల పేర్లు బయటకు వచ్చాయి. వీరిలో ఒకరు దివ్య భర్తకాగా, మరొకరు ఆమె బాబాయి, ఇంకొకరువసంత స్నేహితుడు . అలాగే భర్త వీరబాబు, దివ్య పిన్ని , వసంత స్నేహితుడు కృష్ణ కోసం కూడా గాలిస్తున్నట్లు తెలిపారు. పరారీ లో ఉన్న ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తే అర్ధాంతరంగా ముగిసిపోయిన దివ్య జీవితం వెనుక చీకటి కోణాలు బయటకు వచ్చే అవకాశాలు అవకాశం ఉందని తెలుస్తుంది. హత్య జరిగిన తర్వాత వీళ్లంతా పరారీలో ఉన్నారని చెప్పారు.
దివ్య కేసుతో పాటు దివ్య కుటుంబం మిస్సింగ్ కేసు కూడా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్యకు గురయ్యారని నిందితులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా పోలీసు రికార్డ్స్లో ముగ్గురూ మిస్సింగ్ కేసుగా నమోదై ఉందన్నారు. ఇక వీరి మర్డర్ మిస్టరీ వెనుక కూడా ఏమైనా చీకటి కోణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇక ఈ విషయాన్ని సీపీ ఆర్కే మీనా స్పష్టం చేశారు. మొత్తానికి వ్యభిచార రొంపిలోకి దిగి అదే వ్యభిచార ముఠా చేతిలో అత్యంత పాశవికంగా హతమార్చబడింది దివ్య. ఇక ఆమె కేసుతో ఆమె కుటుంబం మిస్సింగ్ మిస్టరీలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు .