షాకింగ్ ...వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య
వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి, సీనియర్ పొలిటీషియన్ , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది . ఒక పక్క సిట్ వివేకా హత్య కేసును ఛేదించాలని చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తుంటే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను, తన కుటుంబాన్ని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన సూసైడ్ చేసుకొన్నారు.
హత్యతో ఎలాంటి సంబంధం లేదని జగన్ కు , వైఎస్ భాస్కర్ రెడ్డిలకు లేఖ లేఖలు రాసిన శ్రీనివాసులురెడ్డి
తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ శ్రీనివాసులు రెడ్డి సీఎం జగన్ , వైఎస్ భాస్కర్ రెడ్డిలకు లేఖ కూడా రాశాడు. కడప ఆసుపత్రిలోచికిత్స పొందుతూ మరణించాడు. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ తో కేసు కొత్త మలుపు తిరగనుందాఅన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఎన్నికలకు ముందు మార్చి 14వ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయితే అప్పుడే ఆయన హత్యపై నాటకీయ పరిణామాలు, సాక్ష్యాలను లేకుండా చేయటం వంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
వివేకా కేసులో స్పీడు పెంచిన జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ .. ఊహించని విధంగా నిందితుడు సూసైడ్
ఇక ఈ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు అప్పటి టీడీపీ హయాంలోని ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణ సరిగా చెయ్యటం లేదన్న కారణంతో , చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా జగన్ సీఎం అయిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేసారు .ఈ కేసులో అనుమానితులుగా ఉన్న గంగిరెడ్డి, రంగయ్య, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో నార్కో అనాలిసిస్ టెస్టులకు కూడ పులివెందుల కోర్టు అనుమతి ఇవ్వటంతో కోర్టు అనుమతి మేరకు అనుమానితులకు నార్కో అనాలిసిస్ టెస్టులు కూడ చేశారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి .. పోలీసుల వేధింపులే కారణం అని కుటుంబ సభ్యుల ఆరోపణ
త్వరలో ఈ హత్యకేసును ఛేదిస్తారని భావిస్తున్న తరుణంలో కేసులు సంబంధించిన నిందితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు.కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసులు రెడ్డి మృతి చెందారు. తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది . సిఐ రాములు శ్రీనివాసులు రెడ్డిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ లేఖను వైద్యులు పోలీసులకు అందించారు.