బయోమెట్రిక్ వాడలేదని...477 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు
విశాఖపట్నం: ఎపిలో కొందరు టీచర్లకు భారీ షాక్ తగిలింది. బయోమెట్రిక్ వినియోగించనందుకు గాను విశాఖపట్టణం జిల్లాలో 477 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖాధికారి నోటీసులు జారీ చెయ్యడం కలకలం సృష్టించింది. బయోమెట్రిక్ లో వేలిముద్రలు ఎందుకు వెయ్యలేదో మూడ్రోజుల్లో సమాధానం చెప్పాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు తెలిసింది.
విశాఖపట్టణం జిల్లా పరిధిలో ఈ నెల 23 తేదీన బయోమెట్రిక్ మెషీన్ లో వేలిముద్ర వేయలేదన్న సాకుతో ఇలా ఏకంగా 477 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి షోకాజ్ నోటీసులు జారీచేయడం విద్యాశాఖలో పెను ప్రకంపనలు రేపుతోంది.
బయోమెట్రిక్ పనిచెయ్యక, ఇతర సాంకేతిక కారణాల వల్లో ఈ నెల 23న విధులకు గైర్హాజరైనట్లు వెల్లడైన 477 మంది ఉపాధ్యాయులకు విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేయడం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా ఒకేరోజు 477 మంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారని షోకాజ్ నోటీసులు జారీ చేయడం విద్యాశాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ షోకాజ్ నోటీసులు తాను సొంతంగా ఇవ్వలేదని, పాఠశాల విద్య శాఖ కమిషనర్ ఫోన్లో ఇచ్చిన ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసినట్టుగా డీఈవో పేర్కొంటున్నట్లు తెలిసింది. ఏదేమైనా ఆ రోజు ఆబ్సెంట్ అవడానికి కారణాన్ని మూడ్రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని డిఈవో ఆ ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే టీచర్లకు ఈ విషయమై కనీసం మెమో లాంటిది ఇవ్వకుండా ఏకంగా షోకాజ్ నోటీసులు ఇవ్వడమేమిటని ఉపాధ్యాయ సంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
విశాఖ జిల్లాలో వివిధ పాఠశాలల్లో 6,21,965 మంది విద్యార్థులు చదువుతుండగా, 14,281 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఎస్జీటీలు 7261 మంది కాగా, స్కూల్ అసిస్టెంట్లు 7020 మంది ఉన్నారు. వీరందరికి అంటే ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అమలు చేస్తున్నారు. అయితే నెట్వర్క్ సమస్య కారణంగా ఏజెన్సీలోని అనేక పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు కావడం లేదు. దీంతో ఈ హాజరు పద్ధతి అటు ఉపాధ్యాయులతో పాటు ఇటు విద్యార్థులకు నిప్పుతో చెలగాటంలా మారింది. ఎప్పుడు నెట్వర్కు పనిచేస్తుందో...ఎప్పుడు పనిచేయదో తెలియకపోతుండటంతో అటెండెన్స్ వేసేందుకు రోజూ నరకం అనుభవిస్తున్నారు. మెషిన్ పనిచేసినట్లు కనిపించినా వేలి ముద్రలు పడని రోజులు ఉన్నాయని, ఐరిష్ క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియనడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పైగా ఈ మిషన్ లో ఒకే అని వచ్చేవరకు ఒకటికి పదిసార్లు అటెండెన్స్ వేస్తూ ఉండాల్సిందే.
జిల్లాలో 60 శాతం బయోమెట్రిక్ మిషన్లు రోజూ మొరాయిస్తూనే ఉన్నాయని, వీటిని రిపేరు చేయిద్దామన్నా సాంకేతిక నిపుణులు అందుబాటులో లేరని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మెషీన్ లో హాజరు గురించే తప్ప మిషన్ల నిర్వహణ బాగోలేదని చెప్పినా పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోతున్నారు. అసలు మిషన్లు సరఫరా చేసిన కంపెనీలు కూడా అంతటితో చేతులు దులిపేసుకున్నాయే తప్ప తిరిగి వీటి పనితీరు గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. స్థానికంగా ఒకరిద్దరు సాంకేతిక నిపుణులు ఉన్నా ఇంత భారీ సంఖ్యలో ఉన్న మిషన్లకు సాంకేతిక సమస్యలు వస్తే వారు సకాలంలో వచ్చి అన్నింటినీ రిపేరు చేసే పరిస్థితి లేదని అంటున్నారు.