నిధానమే మా ఎజెండా..! 2024లోనే ఎగురుతుంది మా జెండా..! అంటున్న ఏపి కాంగ్రెస్ నేతలు..!!
ఏపి/హైదరాబాద్: ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్పార్టీ పార్టీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత కనుమరుగైపోయింది. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మిన చందంగా మారింది ఆ పార్టీ పరిస్థితి. అలాంటి పార్టీకి మళ్లీ ఇప్పుడు ఆశాకిరణాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఏపీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. అటు కేంద్రంలో, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదేళ్లపాటు అధికారం చెలాయించింది. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ కూడా కాంగ్రెసే! అలాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్కి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రస్ గల్లంతయ్యింది. ఓటు అనే అస్త్రాన్ని ప్రయోగించి ఆ పార్టీని సీమాంధ్రులు అథఃపాతాళానికి తొక్కేశారు. ఘనత వహించిన హస్తంపార్టీకి గత ఎన్నికల్లో ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కకపోవడం విశేషం..!
గుడ్డిలో మెల్ల..! కాంగ్రెస్ కు అనుకూలంగా మారిన బీజేపి విధానం..!
నాటి పరిస్థితులను భేరీజువేసుకున్న కొంతమంది కాంగ్రెస్ నేతలు అధికారపక్షమైన టీడీపీలోకీ, మరికొందరు వైసీపీలోకీ జంప్ చేశారు. తద్వారా తమ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్నే నమ్ముకున్న కొందరు మాత్రం ఇంకా హస్తంనీడలో కొనసాగుతున్నారు. అలాంటివారు అప్పట్లో అధికార కూటమిగా ఉన్న టీడీపీ, బీజేపీలపై విమర్శలు చేస్తూ తమ అస్తిత్వం చాటుకునే ప్రయత్నం చేస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ మొండిచేయి చూపింది. ఈ అంశం ఏపీ కాంగ్రెస్ నేతలకు వరప్రసాదంగా మారింది. గతంలో తామిచ్చిన విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ గట్టిగా గొంతెత్తారు. దీనికి తోడు ఏపీ ప్రజలు కూడా మోదీ సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశాలన్నీ ఏపీ కాంగ్రెస్ నేతలకీ, ఆ పార్టీ క్యాడర్కీ ఎంతో ఊరటనిచ్చాయి.
కాంగ్రెస్ దిగ్గజాలు కూడా దిక్కులు చూడాల్సిందే..! వ్యతిరేక ఆ స్థాయిలో ఉంది మరి..!
గతంలో కాంగ్రెస్పార్టీ దశాబ్దంపాటు అధికారంలో ఉన్నప్పటికీ నామినేటెడ్ పోస్టులను పెద్దగా భర్తీ చేయలేదు. ఆయా పదవులపై ఆశపెట్టుకున్న నేతలు చివరికి నిరాశచెందారు. ఇదే సమయంలో పార్టీ క్యాడర్కు సరైన గుర్తింపు లభించలేదు. ఇలాంటి పరిణామాలు ఆ పార్టీకి ఎంతో నష్టంచేశాయి. 2014లో ఓటమి తర్వాత కొద్దిమంది నేతలే మిగిలారు తప్ప క్యాడర్ పత్తాలేదు. అయితే తాజా పరిణామాలతో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో కొద్దిగా జీవకళ ఉట్టిపడుతోంది. ఇంతకు ముందు పార్టీ సమావేశం పెడితే పదిమంది రావడమే గగనంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడింది. పార్టీపరంగా ఏదైనా కార్యక్రమం చేపడితే కెమేరాలకు సరిపడా జనం వస్తున్నారు. ఉమెన్చాందీ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాత నేతలను పలుకరిస్తున్నారు. నల్లారి కిరణ్కుమార్రెడ్డి వంటి దిగ్గజాలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
రాహుల్ ఇచ్చిన ఇచ్చిన వజ్రాయుధం ప్రత్యేక హోదా..! అది చాలంటున్న కాంగ్రెస్ నేతలు..!
వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటూ రాహుల్గాంధీ ప్రకటించారు. దీంతో ఏపీ కాంగ్రెస్ నేతలకి చెప్పుకోవడానికి ఒక అంశమంటూ దొరికింది. ఏపీలో మిగతా ప్రాంతాలతో పోల్చితే విశాఖలో ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీమంత్రి బాలరాజు సహా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన అభ్యర్థులు ఎందరో నేటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ మధ్యనే ఉమెన్చాందీ మూడురోజులు పర్యటించారు. విశాఖ నగరం, రూరల్ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వచ్చిన కార్యకర్తలు, ప్రజల సందడి బాగానే ఉంది. దీంతో తమకీ మంచిరోజులు వస్తాయన్న ఆశలు నేతల్లో చిగురించాయి. ఏపీలో అడుగంటిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు బూత్కమిటీలు వేసుకునే దశకి ఎదిగింది.
వస్తాం..! ఎప్పుడు వస్తామో తెలియదు..!రావడం మాత్రం పక్కా..!!
మరోవైపు విశాఖ దక్షిణంలో ద్రోణంరాజు శ్రీనివాస్, పాడేరులో మాజీమంత్రి బాలరాజు తమ పలుకుబడిని కాపాడుకుంటూ వచ్చారు. ఆ ఇద్దరు నేతలు వైకాపా పక్షాన బరిలోకి దిగితే గెలిచే అవకాశం ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పక్షాన వారు రంగంలోకి దిగితే గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని కూడా అంటున్నారు. తమ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టి వైసీపీ బలపడిందనీ, తాము మళ్లీ ఏపీలో బలపడితే ఆ పార్టీకే నష్టం జరుగుతుందనీ కొందరు జోస్యం చెబుతున్నారు. ఇదీ ప్రస్తుతం విశాఖలో కాంగ్రెస్పార్టీ బలాబలాల సంగతి! ఈ మధ్య ఏఐసీసీ సభ్యుడు క్రిష్టోఫర్ విశాఖ నగరంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు పెడుతున్నారు. చెల్లాచెదురైన పార్టీ క్యాడర్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాకపోయినా 2024 ఎన్నికల నాటికైనా తమ పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న విశ్వాసం కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో నిధానమే ప్రధానం అనే నానుడికి మంచి గౌరవం ఉంటుంది సుమీ..!!