కరోనా అమానుషం: అంబులెన్స్ కోసం చూస్తూ నడిరోడ్డుపై వ్యక్తి మృతి, కాలువలో నిర్జీవ శిశువు
అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా అనేక అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఘటనలు జరుగుతుంటే.. కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా మరికొన్ని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా, ఏపీలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి.
Recommended Video
అంబులెన్స్ కోసం చూస్తూ నడిరోడ్డుపై ప్రాణాలు వదిలాడు..
కరోనా అనుమానిత లక్షణాలతో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఆస్పత్రికి వెళ్లేందుకు ఇంటి బయటకు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందారు. తీవ్రమైన ఆయాసంతో బయటికి వచ్చిన అతడు.. అంబులెన్స్ కోసం వేచిచూస్తూ ఒక్కసారిగా నడిరోడ్డుపై కుప్పకూలి మరణించాడు.
నాలుగు గంటలపాటు నడిరోడ్డుపైనే మృతదేహం.. ఫ్యామిలీ దూరమే..
కాగా, కరోనా అనుమానంతో మృతదేహం వద్దకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు కూడా వెనుకడుగు వేశారు. దీంతో నాలుగు గంటలపాటు రోడ్డుపైనే మృతదేహం ఉండిపోయింది. సమాచారం అందుకున్న సత్తెనపల్లి పురపాలక అధికారులు హిందూ మహా ప్రస్థానం సాయంతో మృతదేహాన్ని తరలించారు. హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు.
కాలువలో నిర్జీవ శిశువు..
ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా అనుమానంతో అప్పుడే పుట్టిన బిడ్డను సాగునీటి కాలువలోకి విసిరేశారు. స్మశాన వాటికలో నిర్జీవ శిశువు అంత్యక్రియలకు స్థానికులు అంగీకరించలేదు. కరోనా ఉందనే అనుమానంతో అడ్డుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని నంద్యాల బ్లాక్ ఛబోలు గ్రామంలో చోటు చేసుకుంది.
కరోనా అనుమానంతోనే...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం శంషావలి అనే వ్యక్తి గర్భిణి అయిన తన భార్యను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. శనివారం ఆమె ఒక నిర్జీవ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును తమ స్వగ్రామంలో ఖననం చేయాలని నిర్ణయించారు. అయితే, కరోనా అనుమానంతో గ్రామస్తులు గ్రామంలోని స్మశాన వాటికలో ఆ నిర్జీవ శిశువును ఖననం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆ నిర్జీవ శిశువును కర్నూలు-కడప కెనాల్(కేసీ కెనాల్)లోకి విసిరేశాడు శంషావలి. కాలువలో శిశువు మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలులో కొట్టుకుపోతున్న శిశువు మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తర్వాత గ్రామస్తులను ఒప్పించి స్థానిక స్మశాన వాటికలో ఆ శిశువును ఖననం చేయించారు.