పిల్లలు పుట్టలేదని అత్తారింటి వేధింపులు: ఎస్సై భార్య ఆత్మహత్మ
పెళ్లయ్యి ఏడాదిన్నరే అయ్యింది. కానీ, పిల్లలు పుట్టటడం లేదని అత్తారింటి నుండి వేధింపులు మొదలయ్యాయి.
కర్నూలు: పెళ్లయ్యి ఏడాదిన్నరే అయ్యింది. కానీ, పిల్లలు పుట్టటడం లేదని అత్తారింటి నుండి వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి భర్త పుట్టింటిలో వదిలి వెళ్లడంతో కర్నూలు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దారుణం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సంచలనంగా మారింది. కర్నూలు కు చెందిన ఖాజా హుస్సేన్ అనంతపురం జిల్లా గుదిబండలో గత కొంత కాలంగా ఎస్సైగా పని చేస్తున్నాడు. గత ఏడాది ఏప్రిల్లో కర్నూలు లక్ష్మి నగర్కి చెందిన అంజున్ బేగంతో ఖాజా హుస్సేన్కి పెళ్లయింది.
ఈ సందర్భంగా 30 తులాల బంగారం, భారీగా నగదును కట్న కానుకలుగా ఇచ్చారు. భార్య భర్త ఇద్దరూ గుడి బండలోనే నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లయి ఏడాదిన్నర అయినా పిల్లలు పుట్టలేదంటూ అత్తారింటి వేధింపులు ఎక్కువ అయ్యాయని బేగం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గురువారం రాత్రి ఎస్సై ఖాజా హుస్సేన్ భార్య అంజున్ బేగంను తీసుకుని కర్నూలు వచ్చాడు. భార్యని ఆమె పుట్టింటిలో వదిలి వెళ్ళాడు. అతను వెళ్ళగానే భార్య అంజున్ బేగం ఇంటిలోకి వెళ్లి తాళం వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృత దేహాన్ని చూసేందుకు కూడా ఎస్సై ఖాజా హుస్సేన్ రాలేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.అంజున్ అత్తారింటిపై కేసు పెట్టాలని ఆమె కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.