తొందర పాటు నిర్ణయాలుండవు: పవన్ కాకినాడ సభలో అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
అమరావతి: కాకినాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్పారనేదానిపై అభిమానుల్లో, రాజకీయ విశ్లేషకుల్లో గందరగోళం నెలకొంది. నిజానికి కాకినాడ సభలో ఏపీకి హోదా సాధించే విషయంలో తమకు దిశా నిర్దేశం చేస్తారని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది.
ప్రత్యేక హోదా ఇవ్వబోమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ విస్పష్టంగా ప్రకటించినా కేంద్ర ప్రకటనను సీఎం చంద్రబాబు స్వాగతించినానని చెప్పినా.. ఆ విషయాలు తనకు తెలియనట్లే పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ప్రసంగించారు. ప్రత్యేక హోదా ఇస్తారా లేదా? అని కేంద్రాన్ని, పాచిపోయిన రెండు లడ్డూలను తీసుకుంటారో లేదో తేల్చుకోవాలని చంద్రబాబును ప్రశ్నించారు.
అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు
కేంద్రం హోదా లేదని తేల్చిపారేసి, ఏం చేస్తాం, ఎలా చేస్తామనేది వెల్లడించకపోవడాన్ని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. పోరాడితే పోయేది ఏమీలేదని ఆవేశంగా వల్లె వేసే పవన్ హోదా కోసం పోరాట పంథాను ఎంచుకోవద్దని యువతకు సూచించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
వెంకయ్యపై తీవ్ర విమర్శలు
నిజానికి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పాపానికి ఇప్పటికే రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసి పవన్ విమర్శలు చేయడం, రెండేళ్ల కిందట జరిగిన విభజన గాయాలను రేపే ప్రయత్నం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. హోదా ఇవ్వలేదని బీజేపీపై.. అందులోనూ ప్రత్యేకంగా వెంకయ్య నాయుడుపైనే విమర్శలు చేశారు.
హోదా సంజీవని కాదని, సహాయం చాలన్న ముఖ్యమంత్రి
అయితే హోదా సంజీవని కాదని, సహాయం చాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు. ఏపీకి నాడు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే.. నేడు బీజేపీ పొట్టలో పొడిచిందని అన్న పవన్ వారిపై పోరాటాన్ని ఎందుకు ప్రకటించడంలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
టీడీపీ ఎంపీ అవంతికి బంఫర్ ఆఫర్
టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమైతే తాను దగ్గరుండి గెలిపిస్తానని ప్రకటించిన పవన్ అదే విధంగా కేంద్రంలో మంత్రులుగా ఉన్న అశోక్గజపతిరాజు, సుజనాచౌదరిల రాజీనామాలను ఎందుకు కోరలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
బంద్లు, సమ్మెలకు తాను వ్యతిరేకం కాదు
బంద్లు, సమ్మెలకు తాను వ్యతిరేకం కాదంటూనే, విద్యార్థులు చదువుకోవాలని, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోవాలని సూచించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరికీ అంతు చిక్కడం లేదు. హోదాకోసం ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో స్పష్టత నివ్వలేదు.
సంయమనంతో ఆచితూచి ముందుకు వెళ్లాలి
మరోవైపు హోదా కోసం సంయమనంతో ఆచితూచి ముందుకు వెళ్లాలని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి తెలిపారు. రాష్ట్రంలో భావోద్వేగాలు ఉన్న సమయంలో ఏదిపడితే అది మాట్లాడకూడదన్నారు.
ఎవరైనా చనిపోతే తనకు ఎంతో బాధ కలుగుతుంది
తన సభకు వచ్చిన వారు ఎవరైనా చనిపోతే తనకు ఎంతో బాధ కలుగుతుందని పేర్కొన్నారు. తన వల్ల ఇతరులు నష్టపోవడం తనకు ఎంతమాత్రం ఇష్టం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా జరుగుతుంటే తాను ఉద్యమం మరో మార్గంలో చేసుకుంటానని చెప్పారు. తన నుంచి కొందరు ఆశిస్తున్నట్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలూ ఉండబోవని స్పష్టం చేశారు.