ఓ సిఎంపై మరో సిఎం అధికారం చట్ట విరుద్ధమే: సిక్కిం మాజీ గవర్నర్
హైదరాబాద్/ న్యూఢిల్లీ : ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరో రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చెలాయించడం చట్టవిరుద్ధమేనని సిక్కిం మాజీ గవర్నర్ రామారావు వ్యాఖ్యానించారు. సెక్షన్-8 పై కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించిందో చూడాలని ఆయన కోరారు.
ఓటుకు-నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని ఆయన చెప్పారు. విభజన బిల్లు పెట్టినపుడే సెక్షన్-8పై చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి గవర్నర్ మాట్లాడాలని రామారావు సూచించారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఏనాడు సెక్షన్-8 గురించి మాట్లాడలేదని, వారిద్దరు సంక్షోభంలో ఉన్నారు కాబట్టే సెక్షన్-8 గుర్తుకువచ్చిందని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉభయ రాష్ట్రాల సమస్యలపై గవర్నర్, కేంద్రం సకాలంలో స్పందించలేదని విమర్శించారు. కేంద్రం కూడా రాజకీయ ప్రయోజనాలతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్లు చర్యలు తీసుకోకపోవడమే ప్రస్తుత సమస్యలకు కారణమని ఆయన అన్నారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని నారాయణ తెలిపారు.