టీడీపీలో నిశ్శబ్ద విప్లవం ..చంద్రబాబు దీక్షకు ఆ ఎమ్మెల్యేలు డుమ్మా
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష చేసిన వేళ తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ యువనేత దేవినేని అవినాష్ రాజీనామా చేసి, వైసీపీలో చేరడంతో పాటు, వల్లభనేని వంశీ చంద్రబాబు టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించడం టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదలా ఉంటే చంద్రబాబు నాయుడు చేసిన ఇసుక దీక్షకు టిడిపి ఎమ్మెల్యేలు పట్టుమని పదిమంది కూడా హాజరు కాకపోవడం ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో మరింత టెన్షన్ కు కారణం అవుతుంది. ఎపీలోనూ చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు దీక్షకు హాజరుకాని 14మంది టీడీపీ ఎమ్మెల్యేలు
తెలుగుదేశం పార్టీ నుండి గత ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇక వీరిలో ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పోగా మిగతా 22 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అధినేత చంద్రబాబు చేసిన ఇసుక దీక్షకు హాజరుకాకపోవడం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇసుక కొరత కు నిరసనగా 12 గంటల దీక్ష చేపట్టిన చంద్రబాబు బిజెపి మినహా మిగతా ప్రతిపక్ష పార్టీల మద్దతుతో దీక్షను సక్సెస్ చేసినా, టిడిపి ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబు ఇసుక దీక్షకు హాజరుకాకపోవడంతో అది పెద్ద మైనస్ గానే కనిపిస్తోంది. తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మొదలైంది
ప్రకాశం జిల్లా లో నలుగురు గెలిస్తే హాజరయ్యింది ఒక్కరే
విజయవాడ ధర్నా చౌక్ సెంటర్లో చంద్రబాబు చేసిన ఇసుక దీక్షకు టిడిపి ఎమ్మెల్యేలు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 23 మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే బాబు ఇసుక దీక్షకు హాజరయ్యారు. మిగతా 14 మంది రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లా నుండి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రమే బాబు దీక్షకు హాజరయ్యారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
వైజాగ్ నుండి నలుగురు గెలిస్తే హాజరైంది వెలగపూడి రామకృష్ణ మాత్రమే
వైజాగ్ నుంచి గెలిచిన నలుగురు శాసనసభ్యులలో ముగ్గురు చంద్రబాబు దీక్షకు డుమ్మా కొట్టారు. కేవలం వెలగపూడి రామకృష్ణ మాత్రమే వచ్చారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్,మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, బెందాళం అశోక్ దీక్ష కు హాజరు కాలేదు. ఇక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అమెరికాలో ఉండడం వల్ల రాలేకపోయారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పయ్యావుల కేశవ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు.
14 మంది గైర్హాజరుతో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్
మొత్తంగా 14 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు ఇసుక దీక్షకు హాజరుకాకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో వీరంతా టీడీపీలో కొనసాగుతారా లేక పార్టీ మారతారా అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే బీజేపీ తో సహా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ప్రకటన చేసిన నేపథ్యంలో, ఎవరికి వారు జంప్ అవడానికి ప్లాన్ చేస్తున్నారా అన్నది ప్రస్తుత ఏపీ లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీలో అంతర్గత కలహాలు .. దేవినేని అవినాష్ , వల్లభనేని వంశీ వ్యాఖ్యల సారాంశం
ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో గత ఎన్నికల తర్వాత నెలకొన్న పరిణామాలు అటు పార్టీ అధినేత చంద్రబాబును, పార్టీ కేడర్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న దేవినేని అవినాష్ పార్టీ మారడం, పార్టీలో పరిస్థితి పై తన అసంతృప్తిని వెళ్ళగక్కటం , మరోవైపు వల్లభనేని వంశీ సైతం చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం, నారా లోకేష్ ను, దేవినేని ఉమా ను టార్గెట్ చేసి మాట్లాడడం పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
Recommended Video
పార్టీ మారేందుకు నిశ్శబ్ద విప్లవం.. టెన్షన్ లో చంద్రబాబు
ఇప్పటికే పలువురు అసంతృప్తులు టిడిపిలో కొనసాగాలా వద్దా అంతర్మధనం లో ఉన్న సమయంలో జంప్ జిలానీలు చేస్తున్న వ్యాఖ్యలు టిడిపిని మరింత ఇబ్బందికర పరిస్థితులలోకి నెడుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పటికే టిడిపి లో చాలామంది కీలక నేతలు,గతంలో మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు,నారాయణ వంటి నేతలు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకోకపోవడం,పెద్దగా మాట్లాడక పోవడం గమనిస్తే టిడిపి నేతలు పార్టీలు మారడానికి ఓ నిశ్శబ్ద విప్లవం కొనసాగిస్తున్నాయని అర్థమవుతుంది. ఇదే ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబును, తెలుగు తమ్ముళ్లను టెన్షన్ పెడుతోంది.