శిల్పా కోసం విభేదాలను పక్కన పెట్టిన భూమా, శిల్పా మాత్రం ఇలా...ఎందుకు?
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.అయితే టిడిపి లో నంద్యాల ఉప ఎన్నిక చిచ్చును రాజేసింది. పోటీకి ఎవరికి వారే రంగం సిద్దం చేసుకొంటున్నారు.
నంద్యాల: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.అయితే టిడిపి లో నంద్యాల ఉప ఎన్నిక చిచ్చును రాజేసింది. పోటీకి ఎవరికి వారే రంగం సిద్దం చేసుకొంటున్నారు. మాజీ మంత్రులు శిల్పా మోహన్ రెడ్డి, ఎన్ ఎం డి ఫరూక్ లు పోటీకి సై అంటున్నారు. అయితే భూమా కుటుంబానికే పార్టీ టిక్కెట్టును కేటాయించే అవకాశం లేకపోలేదు.అయితే భూమా కుటుంబానికి టిక్కెట్టు కేటాయిస్తే శిల్పా మోహన్ రెడ్డి ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి శిల్పా మోహన్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీచేశాడు. ఆ సమయంలో భూమా నాగిరెడ్డి వైసీపీ నుండి పోటీచేశాడు.అయితే శిల్పా మోహన్ రెడ్డిపై భూమా నాగిరెడ్డి విజయం సాధించారు.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి 2016 లో వైసీపీని వీడి టిడిపిలో చేరారు.అయితే భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని శిల్పా మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కాని, పార్టీ అవసరాల రీత్యా చంద్రబాబునాయుడు భూమాను పార్టీలోకి తీసుకొన్నారు.
అయితే గత మాసంలో గుండెపోటుతో భూమా నాగిరెడ్డి ఆకస్మికంగా మరణించారు.అయితే భూమా నాగిరెడ్డి మరణంతో ఆయన కూతురు భూమా అఖిలప్రియకు చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.
నంద్యాల ఉప ఎన్నికపై ఎవరికి వారే
నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ స్థానం నుండి భూమా కుటుంబం నుండి ఎవరో ఒకరికి టిక్కెట్టును కేటాయించాలని పార్టీ భావిస్తోంది.అయితే భూమా కుటుంబ సభ్యులకు టిక్కెట్టు కేటాయిస్తే పోటీకి దిగాలని శిల్పా మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. అవసరమైతే పార్టీ మారే యోచనను కూడ చేస్తున్నారు.మరో వైపు మాజీమంత్రి టిడిపి నాయకుడు ఎన్ ఎం డి ఫరూక్ కూడ పోటీచేయాలని భావిస్తున్నారు.భూమ కుటుంబసభ్యులకు టిక్కెట్టు కేటాయిస్తే అభ్యంతరం లేదన్నారు.ఒకవేళ భూమా కుటుంబసభ్యులకు టిక్కెట్టు ఇవ్వకపోతే శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తే ఓడిస్తామని ఫరూక్ అనుచరులు చెబుతున్నారు.
పార్టీ వీడుతామని హెచ్చరిస్తున్న నేతలు
నంద్యాల ఉప ఎన్నిక విషయం టిడిపికి తలనొప్పిగా మారింది.పోటీకి టిడిపి నాయకులు శిల్పా మోహన్ రెడ్డి, ఫరూక్ లు సన్నాహాలు చేసుకొంటున్నారు.అయితే పార్టీ టిక్కెట్టు కేటాయించకపోతే పార్టీని వీడే ఆలోచన కూడ శిల్పా మోహన్ రెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ మారే పరిస్థితులు అనుకూలించకపోతే స్వతంత్రంగానైనా పోటీకి సిద్దం కావాలని ఆయన భావిస్తున్నారు.మరో వైపు భూమా కుటుంబ సభ్యులకు కాకుండా శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్టు కేటాయిస్తే పార్టీని వీడేందుకు కూడ వెనుకాడబోమని ఫరూక్ అనుచరులు చెబుతున్నారు.
విబేధాలను పక్కన పెట్టిన భూమా నాగిరెడ్డి
నంద్యాల నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది. ఈ కారణంగానే భూమా నాగిరెడ్డి టిడిపిలోకి రావడాన్ని శిల్పా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రి పదవిని ఇవ్వకూడదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.అయితే ఈ వీరిద్దరి మధ్య మంత్రి అచ్చెన్నాయుడు రాజీ కుదిర్చాడు. దరిమిలా భూమా నాగిరెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి కొడుకు వివాహనికి హజరయ్యారు.స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చక్రపాణి రెడ్డిని గెలిపిస్తామని బాబుకు ఆయన హమీ ఇచ్చాడు.
భవిష్యత్ కోసమే శిల్పా పోరాటం
భూమా నాగిరెడ్డి మరణించడంతో శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాలలో అడ్డులేకుండాపోయిందని భావించారు.అయితే ఉప ఎన్నికల్లో తిరిగి భూమా కుటుంబానికి టిక్కెట్టు కేటాయిస్తే తనకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని శిల్పా భావిస్తున్నారు. ఈ మేరకు పోటీకి సిద్దమంటున్నారు.అంతేకాదు 2014 ఎన్నికల్లో శిల్ఫా మోహన్ రెడ్డి ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన విషయాన్ని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఈ స్థానం భూమా కుటంబ సభ్యులకు అప్పగిస్తే భవిష్యత్తులో కష్టమయ్యే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.