రజనీకాంత్-పవన్ కళ్యాణ్: అక్కడే ఇద్దరి మధ్య తేడా! దానికి జనసేనాని ఫుల్స్టాప్
హైదరాబాద్/అమరావతి: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి జోరుగా చర్చ సాగుతోంది. ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయం మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఆయన అభిమానుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
మోడీ-బాబులకు దిమ్మతిరిగే 'పవర్' పంచ్: ఆ ముద్ర చెరిపేసుకొని, వైసీపీ నోరు మూయించేందుకు రెడీ
రాజకీయాల్లోకి వస్తే పక్కా వ్యూహాలతో సిద్ధం కావాలని ఆయన భావిస్తున్నారని అర్థమవుతోంది. గతంలో పార్టీలు పెట్టిన నటుల అనుభవాలు పరిగణలోకి తీసుకొని, వాటిని బేరీజు వేసుకొని, అభిమానులతో పాటు ప్రజాభిప్రాయం మేరకు ఆయన ముందుకు సాగే అవకాశముందని అంటున్నారు.
తోడుదొంగలు గేమ్ బాగా ఆడుతున్నారు: పవన్-బాబులపై కత్తి మహేష్ సంచలనం, 'అంత మాటా!'
రజనీకాంత్ రావాలి కానీ, ఆ అంశమే బాధాకరం!
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి మంచి వ్యక్తి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో అలాంటి సహృదయ వ్యక్తి రాజకీయ మకిలి అంటించుకోవడం మంచిది కాదనే వారూ లేకపోలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎదుటి వ్యక్తిని దెబ్బతీసేందుకు ఏ రకమైన బురద జల్లేందుకైనా వెనుకాడరు. ఆ అంశమే... ఆయన మకిలి అంటించుకోవడం ఎందుకు అనేందుకు కారణంగా కనిపిస్తోంది.
ఈ పార్టీల నుంచి పాఠాలు
దక్షిణాది విషయానికి వస్తే ఎన్టీఆర్, ఎమ్జీఆర్లు పార్టీలు పెట్టి సినిమాలతో పాటు రాజకీయాల్లోను ప్రజాదరణ చూరగొన్నారు. ఇటీవలి కాలం విషయానికి వస్తే పదేళ్ల క్రితం చిరంజీవి పార్టీ పెట్టి విఫలమయ్యారు. తన పార్టీని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తమిళనాట విజయకాంత్ పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోకి వస్తే ఈ పార్టీల విజయాలు, వైఫల్యాల నుంచి ఆయన వ్యూహాలు రచించే అవకాశాలున్నాయి.
పవన్ కళ్యాణ్లా ధైర్యం చేస్తారా!?
మూడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారు. విభజన నేపథ్యంలో నవ్యాంధ్రకు అనుభవమైన రాజకీయ నాయకుడు కావాలని 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ టీడీపీతోనే ఉంటారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. అయితే తాను మద్దతిచ్చిన పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన నిలదీస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు సినిమా తారలను ప్రతి నాయకుడు పొగుడుతారు. అడుగు పెట్టాక మాత్రం విమర్శలు గుప్పించడం సహజమే. అయితే ఎలాంటి మచ్చలేని రజనీకాంత్ వీటిని తట్టుకోగలరా, ధైర్యం చేయగలరా అనే చర్చ కూడా సాగుతోంది. ఇక్కడ ఓ విషయం.. ఆయన ధైర్యం చేసి ప్రజలకు మంచి చేసేందుకు విమర్శలకు కూడా సిద్ధపడినా మిగతా వారు అందరు కలిసి వెనక్కి లాగే అవకాశాలు కూడా ఉంటాయి. దీనిని కూడా ఆయన పరిగణలోకి తీసుకొని 31వ తేదీన ప్రకటన చేయనున్నారని భావిస్తున్నారు.
రజనీకాంత్ విషయంలో గందరగోళం
ఇక, రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను పోల్చుతున్నారు. ఓ విధంగా ఇద్దరు కూడా అభిమానులను, కార్యకర్తలను, ప్రజలను గందరగోళంలో ఉంచేశారని, ఇప్పుడు ఓ క్లారిటీకి వస్తున్నారని అంటున్నారు. అందుకు కారణం ఉంది.
వస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ
రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై దశాబ్దాలుగా చర్చ సాగుతోంది. కానీ గత కొన్ని నెలలుగా మాత్రం తారాస్థాయికి చేరుకుంది. అందుకు ఆయన అభిమానులతో భేటీ కావడం, ఆయన మాటలు కారణం. కానీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే ఉత్కంఠకు మాత్రం ఇప్పటి వరకు తెరపడలేదు. ఇప్పుడు మాత్రం మరో నాలుగు రోజుల్లో తెరపడే అవకాశాలున్నాయి. రజనీ పార్టీ పెడతారా లేదా అని అందరిలోని ఆయన రాజకీయ ఆరంగేట్రంపై గందరగోళం కనిపించింది.
ఆ గందరగోళానికి ఫుల్స్టాప్
మరోవైపు, జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాక ప్రజలను గందరగోళంలోకి నెట్టారనే వాదనలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ పెట్టి మూడేళ్లయినా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకపోవడంపై విమర్శలు వచ్చాయి. అసలు ఆయన పోటీ చేస్తారా లేదా అనే సస్పెన్స్ ఇటీవలి వరకు కొనసాగింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, అలాగే సినిమాలు వదిలేస్తానని ఇటీవల చెప్పడం ద్వారా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే అంశంపై ఆయన గందరగోళానికి ఫుల్స్టాప్ పెట్టారు.
పవన్ కళ్యాణ్పై ఈ గందరగోళం
విపక్షాల వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే మరో గందరగోళం మాత్రం కొనసాగుతోంది. ఆయన చంద్రబాబుకు ఇబ్బంది ఉన్నప్పుడే బయటకు వస్తారనే విమర్శలు ఉన్నాయి. ఆయన లేవనెత్తే సమస్యల పైనే ప్రభుత్వం స్పందిస్తోందంటే వారి మధ్య ఏదో ఉందని విపక్షాలు అనుమానిస్తున్నారు. అయితే పవన్ సమస్యపై చిత్తశుద్ధితో మాట్లాడుతున్నారని, అందుకే ప్రభుత్వం స్పందిస్తోందని అంటున్నారు. 2019లో పోటీ చేయనున్న పవన్ను ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇప్పటి నుంచే ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాయనే వారు కూడా లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవరితో వెళ్తారు, రెండు రాష్ట్రాల్లోను పోటీ చేస్తారా, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే అంశం ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాలకు కేటాయించిన తర్వాత తేలనుంది.