సింపుల్ గా వివాహం చేసుకున్న వైసీపీ ఎంపీ మాధవి .. రిసెప్షన్ కు జగన్
ఇటీవల ఏపీలో ఆ మహిళా వైసీపీ ఎంపీ వివాహంపై పెద్ద చర్చ జరిగింది. పెళ్లి పీటలు ఎక్కుతున్న మాధవి ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి ,ఎన్నో కష్ట నష్టాలను తట్టుకుని పోరాటం సాగించి ఒక మంచి పొజీషన్ కు వచ్చిన తర్వాత ఆ ప్రేమ జంట ఏకం కావటం అచ్చం సినీ స్టొరీ లా అనిపించినా ఎంపీ గొట్టేటి మాధవి విషయంలో అచ్చు ఇలాగే జరిగింది.
నేడు మేళతాళాలతో,వేద మంత్రాల నడుమ వారిద్దరూ ఒక్కటయ్యారు. సాదా సీదాగా ఎంపీ మాధవి కల్యాణం జరిగింది. రాజకీయాల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారే తమ స్థాయి తెలిసేలా ఎలాంటి వేడుక అయినా చాలా ఘనంగా జరుపుతున్న తరుణంలో ఒక ఎంపీగా గెలిచి ,అందులోనూ కేంద్ర మాజీ మంత్రి, ఐదు సార్లు లోక్సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికైన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ను ఓడించి తనకంటూ ఓ స్థానం సుస్థిరం చేసుకున్నగొట్టేటి మాధవి ఒక సాధారణ అమ్మాయిలా కళ్యాణం చేసుకున్నారు.
గొలుగొండ మండలం కృష్ణ దేవి పేటకు చెందిన కుసిరెడ్డి శివ ప్రసాద్ తో తెల్లవారుజామున 3.15 నిముషాలకు జరిగింది. విశాఖ జిల్లాలోని ఆమె స్వగ్రామం చెరబన్నపాలెంలో జరిగిన ఈ కళ్యాణ వేడుకకు వైసీపీ నాయకులు హాజరయ్యారు. ఆమె చిన్ననాటి స్నేహితుడు కుసిరెడ్డి శివప్రసాద్ ను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు.
గతంలో స్కూల్ టీచర్ గా పని చేసిన మాధవి అరకు నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక మాధవి భర్త శివ ప్రసాద్ ఎస్. టి థెరిస్సా విద్యా సంస్థల కరెస్పాండెంట్, శివ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ దంపతులను ఆశీర్వదించటానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారని పార్టీ శ్రేణులు చెప్తున్నారు.