మోడీ తరువాత చంద్రబాబే...ఎపి వల్ల సింగపూర్ కే లాభం:బుగ్గన రాజేంద్రనాథ్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ కంపెనీలకు దోచిపెడుతున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. ఎపి వల్ల సింగపూర్ వాళ్లే లబ్ధి పొందుతున్నారని, కానీ వారి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని బుగ్గన విమర్శించారు.
హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల చంద్రబాబు పాలనను దుయ్యబట్టారు. గత నాలుగేళ్లలో ఆరు సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లిన సిఎం చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని బుగ్గన ప్రశ్నించారు. అసలు సింగపూర్ సదస్సుకు చంద్రబాబును ఎవరూ పిలువలేదన్నారు. తానే టికెట్టు కొనుక్కుని మరీ చంద్రబాబు ఆ సదస్సుకు వెళ్లారని బుగ్గన వెల్లడించారు.
మోడీ తరువాత...చంద్రబాబే
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ విదేశీ పర్యటనలు చేసింది చంద్రబాబేనని, కానీ వాటి వల్ల రాష్ట్రానికి ఖర్చులు తప్ప ఏపీకి ఏ ప్రయోజనం ఏమీ చేకూరలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఎపి వల్ల సింగపూర్ వాళ్లే లబ్ధి పొందుతున్నారని, కానీ వారి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని బుగ్గన విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెడుతూ మాటలతో ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మభ్యపెడుతున్నారని బుగ్గన మండిపడ్డారు.
సింగపూర్ కి తాకట్టు...
అమరావతిలో అందరూ ఎలక్ట్రిక్ బైక్స్లో తిరుగుతున్నట్లు చంద్రబాబు సింగపూర్లో ప్రచారం చేశారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సిఎం చంద్రబాబు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేసినట్లుగా సమావేశాల్లో రైతులతో బలవంతంగా చెప్పిస్తూ ఆ విషయాలను వారి అనుకూలమైన మీడియాలో చంద్రబాబు విస్తృత ప్రచారం చేయించుకుంటున్నారని బుగ్గన ఆరోపించారు. జనాలకు అర్థంకాని రీతిలో మాట్లాడే కళ చంద్రబాబులో ఉందని ఎద్దేవా చేశారు.
యనమల...తోడు ఎందుకు?...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా మంత్రి యనమల రామకృష్ణుడిని తోడు ఎందుకు తీసుకెళ్తున్నారని బుగ్గన ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వెళ్లాల్సిన సమావేశాలు, కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావడమే తప్పు అయితే ఆయన వెంట మంది మార్భలంతో వెళ్లడం సరికాదని హితవు పలికారు. తనకు ధైర్యం చెప్పేందుకే యనమలను చంద్రబాబుకు ఆయన వెంట తీసుకెళ్తున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు.
తప్పుడు ప్రచారం...పరువు పోతోంది
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాణిజ్యం సులభంగా చేయడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అని టిడిపి నేతలు ఊదర గొడుతున్నారని బుగ్గన చెప్పారు. రాష్ట్రం నిజంగా బాగుపడితే అందరూ మద్దతిస్తారని, అయితే టీడీపీ చేసే తప్పుడు ప్రచారంతో ఏపీ పరువు పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2016-2017లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నంబర్ వన్గా నిలిచిందని ప్రచారంతో ఊదరగొడుతున్నారని...కాని రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చాయో...వాటి ద్వారా ఎపికి ఎన్నికోట్ల పెట్టుబడులు తరలివచ్చాయో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు.