సింగపూర్ సర్వీసులకు భారీ స్పందన : విజయవాడ లోనే వీసా కేంద్రం..
ఏపి రాజధాని సమీపంలోని గన్నవరం నుండి ప్రారంభించిన సింగపూర్ సర్వీసులకు ప్రయాణీకుల నుండి స్పందన పెరుగుతోంది. రెండు వారాల క్రితం ప్రారంభించిన ఈ సర్వీసులకు రోజు రోజుకీ స్పందన అనూహ్యంగా ఉంటోంది. హైదరాబాద్ నుండి సింగపూర్ ఎళ్లే ప్రతీ వంద మందిలో సగటున 46 మంది గన్నవరం సమీప జిల్లాల వాసులే ఉంటున్నారని ఏవియేషన్ అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీంతో..విజయవాడలోనే సింగపూర్ వీసా కేంద్రం ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది..
విజయవాడ ఏయిర్పోర్టు నుండి సింగపూర్ కు వెళ్లే విమానాల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోంది. రెండు వారాల క్రితం ప్రారంభించిన విజయవాడ- సింగపూర్ విజయవాడ సర్వీసులకు ఆదరణ పెరుగుతోంది. రెండు వారాల్లో దాదాపు సింగపూర్ నుంచి సగటున 170మంది వరకు ఇక్కడికి వస్తున్నారు. విజయవాడ నుంచి సింగపూర్కు వెళ్ళే వారు సగటున 70 మంది ఉంటున్నారు. స్పందన పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రయాణీకులు ఎదుర్కొంటున్న వీసా సమస్యల పరిష్కారం పైనా ఏపి ప్రభుత్వం దృష్టి పెట్టింది. విజయవాడ లోనే సింగపూర్ కౌన్సులేట్ వీసా కేంద్రా న్ని ఏర్పాటు చేయాలని సంప్రదింపులు ప్రారంభించింది.
దీని పై సింగపూర్ దౌత్య అధికారులు సైతం సానుకూలం గా స్పందించినట్లు సమాచారం. విజయవాడ ఎయిర్పోర్టు నుంచి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, ఖమ్మం, ప్రకాశం జిల్లాలనుంచి ఐదులక్షల మంది విదేశాలలో ఉంటున్నారు. తరచూ ఇక్కడికి రాకపోకలు ఉంటున్నాయి. ప్రతిఏడాది 30 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యశించటానికి వెళుతున్నారు. ఉపాధికి వెళ్ళే వారిశాతం కూడా ఎక్కువుగా ఉంటోందని ఏపి అధికారులు లెక్కలు వివరించారు.
విజయవాడలో వీసా కేంద్రం ఏర్పాటు చేస్తే పరిసర ప్రాంత ప్రజలకు అనువుగా ఉంటోందని భావిస్తోంది. సింగపూర్ సర్వీసుకు ఆదరణ ఉండటం, రానున్న రోజుల్లో మరింత వృద్ధి నమోదయ్యే అవకాశం ఉండటంతో సింగపూర్ కాన్సులేట్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విదేశాలకు ఎక్కువ రాకపోకలు ఉన్నప్రాంతం కావటంతో కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, ఖమ్మం, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుంది.
ఇప్పటివరకు వీసాకోసం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ వెళ్ళాల్సి వస్తోంది. ఇక మీదట విజయవాడలోనే వీసా తీసుకునేందుకు అవకాశం కలుగుతోంది. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీ ఎల్), సింగపూర్ కాన్సులేట్తో వీసాకేంద్రం ఏర్పాటుపై చర్చిస్తోంది. సింగపూర్ కాన్సులేట్ కూడా సానుకూలంగా స్పందించటంతో విజయవాడలో వీసాకేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. త్వరలోనే వీసా కేంద్రం ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని ఏపి ప్రభుత్వం లోని ముఖ్యులు అంచనా వేస్తున్నారు.