విషాదంలో సింగర్ సునీత... సంగీత గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు కన్నుమూత...
ప్రముఖ గాయని సునీత గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు(87) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన సంగీత గురువు ఈ లోకాన్ని వీడి పోవడంతో సింగర్ సునీత భావోద్వేగానికి లోనయ్యారు. ఫేస్బుక్లో గురువు ఫోటోను షేర్ చేసిన సునీత... ఆయన మరణం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
'శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. చాలా బాధగా ఉంది. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే..' అని సునీత పేర్కొన్నారు.
పెమ్మరాజు సూర్యారావు శాస్త్రీయ, కర్ణాటక సంగీతంలో విధ్వాంసులుగా కీర్తి గడించారు. సంగీతంలో ఆయన అందించిన సేవలకు గానూ రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. 2006లో 'సువర్ణ ఘంట కంకనం', 2012లో ఉగాది పురస్కరం, ప్రతిష్టాత్మక 'హంసా అవార్డు'లతో ఆయన్ను సత్కరించింది. 2019 అక్టోబర్లో సామ గణ లహరి కల్చరల్ ట్రస్ట్ 'లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు' కూడా ఆయన అందుకున్నారు.
కాగా,బాల్యంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు వద్ద నేర్చుకున్న సంగీత పాఠాలే సునీతను గొప్ప గాయనిగా తీర్చిదిద్దాయి. అందుకే గురువు మరణం పట్ల ఆమె భావోద్వేగపూరితంగా స్పందించారు. ఇటీవలే డిజిటల్ మీడియా రంగానికి చెందిన రామ్ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన పిల్లల ఆమోదంతో మళ్లీ కొత్త జీవితంలో అడుగుపెట్టిన సునీత వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా తన భర్త గుండెలపై వాలిన ఓ ఫోటోను సునీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. సునీత-రామ్ల వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతోందని చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనంగా కనిపిస్తోంది.