సహకరించలేదు: మల్లాది విష్ణు కస్టడీని కోరిన సిట్
విజయవాడ: విజయవాడలోని స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసులో కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ బృందం మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది.
రెండు రోజుల పాటు విచారించినా కూడా మల్లాది విష్ణు తమకు సహకరించలేదని సిట్ పిటిషన్లో తెలిపింది. మరో ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. మరోవైపు మల్లాది విష్ణు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
కల్తీ మద్యం కేసులో పోలీసులు కాంగ్రెసు పార్టీ నాయకుడు మల్లాది విష్ణును జనవరి 7వ తేదీన అరెస్టు చేశారు. ఈ కేసులో గత రెండు రోజులుగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు చివరకు అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
రెండు రోజుల పాటు దాదాపు 13 గంటులకు పైగా విష్ణును పోలీసులు విచారించారు. లైసెన్స్దారులు చెబుతున్న విషయాలతో పోల్చి చూస్తే విష్ణు చెప్పిన విషయాలు కొంత తేడాగా ఉన్నట్లు తెలిసంది. దీంతో విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.