సంచలనం:విశాఖ ల్యాండ్ స్కామ్ పై సిట్ రిపోర్ట్...నివేదికలో ధర్మాన పేరు; మంత్రి గంటాకు సంబంధం లేదట!
అమరావతి:విశాఖలో ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్పై సిట్ సమర్పించిన నివేదిక సంచలనం సృష్టిస్తోంది. సిట్ మంగళవారం తన రిపోర్ట్ ను కేబినెట్కు అందజేసింది.
అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ భూ కుంభకోణంతో మంత్రి గంటా శ్రీనివాస్ కు ఎలాంటి ప్రమేయం లేదని సిట్ పేర్కొనగా...మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ధర్మాన తో పాటు ఆయన కుమారుడి పేరు మీద ఉన్న భూములపైనా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిట్ నివేదిక చర్చనీయాంశంగా మారింది.
విశాఖ భూ కుంభకోణం...సిట్ నివేదిక
విశాఖ భూ రికార్డుల తారుమారు పై విచారణ జరిపిన సిట్ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సమర్పించిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఈ భారీ స్కాంపై సిట్ ఇచ్చిన నివేదికలో ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్ల పేర్లు ఉన్నాయని తెలిసింది. అలాగే మరో 10 మంది డీఆర్వోలు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయట. మొత్తంగా సుమారు 100 మంది అధికారులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ తన నివేదికలో సూచించినట్లు సమాచారం.
సిట్ రిపోర్ట్...కేబినెట్ కు సమర్పణ
విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ స్కాంపై విచారణను సిట్ కు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సిట్ విశాఖలో గత 15 ఏళ్లుగా జరిగిన భూ లావాదేవీలపై లోతుగా విచారణ జరిపింది. అయితే సిట్ విచారణ పూర్తయినా రిపోర్ట్ సమర్పించడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా సిట్ మంగళవారం కేబినెట్ లో నివేదిక సమర్పించింది.
గంటా పేరు లేదు...అధికారులు ఇరుక్కున్నారు
ఈ ల్యాండ్ స్కామ్ లో గత ప్రభుత్వాలు అక్రమాలకు పాల్పడినట్లు సిట్ పేర్కొందని సమాచారం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ సైనికుల భూములను బడాబాబులు కొట్టేశారని సిట్ తేల్చింది. అయితే ఈ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధం లేదని సిట్ తేల్చేసింది. కానీ ఈ ల్యాండ్ స్కాంతో ఐఏఎస్, గ్రేడ్-1 స్థాయి అధికారుల ప్రమేయం ఉందని సిట్ స్పష్టం చేసింది. ఈ స్కాంలో పాత్రధారులైన కొందరు అధికారులను విధుల నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని సిట్ సూచించింది.
టిడిపి నేతలు సైతం...ఆ భూములు కొన్నారు..
అయితే కొందరు టీడీపీ నేతలు సైతం తక్కువ ధరకు అక్రమంగా భూములు కొనుగోలు చేశారని సిట్ స్పష్టం చేసింది. అలాగే కొన్ని భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పేర్కొంది. అప్పుడు జారీ అయిన ఎన్ఓసీల రద్దు చేయాలంటూ కేబినెట్ కు సిఫార్సు చేయగా మంత్రిమండలి అందుకు రంగం సిద్ధం చేస్తోందని తెలిసింది. దీంతో ఆ భూములు తిరిగి అసలు యజమానుల సొంతమవుతాయని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా సిట్ నివేదికతో కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సిట్ నివేదిక పర్యవసానాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాలి.