అమరావతిపై మరో పిడుగు- లంక భూములపై సిట్ దర్యాప్తు-డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్...
అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కుంభకోణంలో ప్రభుత్వం నియమించిన సిట్ బృందం చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే రాజధాని పేరుతో జరిగిన అక్రమాలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు సాగుతుండగా... సిట్ కూడా రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిట్ ప్రధానంగా తుళ్లూరు కేంద్రంగా సాగిన లంక భూముల వ్యవహారంపై ముందుగా దృష్టిసారించింది.
అమరావతి గ్రామాల్లో మంత్రి బొత్స వరుస పర్యటనలు- జగన్ సర్కార్ తాజా ప్లాన్ ఇదేనా ?
అమరావతిపై సిట్ పిడుగు...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ సాగిన భూముల క్రయవిక్రయాలపై వైసీపీ సర్కారు ముప్పేట దాడి సాగిస్తోంది. రాజధాని భూముల స్కాం దర్యాప్తులో భాగంగా ఇప్పటికే సీఐడీ, సీబీఐ, ఈడీని రంగంలోకి దింపిన సర్కారు.. తాజాగా సిట్ బృందాన్ని కూడా రంగంలోకి దింపింది. దీంతో సిట్ అధికారులు తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమాలపై విచారణ ప్రారంభించారు. నిన్న తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో నాలుగు గంటల పాటు సిట్ బృందం తనిఖీలు చేపట్టింది. లంక భూములకు సంబంధించిన రికార్డులను సిట్ బృందం పరిశీలించింది.
అక్రమార్కుల గుర్తింపు...సస్పెన్షన్ల పర్వం...
రాజధానిలో భూ అక్రమాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని.. డాక్యుమెంట్లను సేకరించిన సిట్ అధికారులు... వాటి ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో తహసీల్దారుగా పని చేసిన అన్నే సుధీర్ బాబు వ్యవహార శైలిపై ఆరా తీస్తున్నారు. రాయపూడి డిప్యూటీ కలెక్టర్ ఉమా దేవిని సిట్ బృందం గతంలో ఓసారి విచారించింది. ఉమాదేవి నుంచి సేకరించిన సమాచారం మేరకు తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సిట్ తనిఖీలు చేపడుతోంది. మరోవైపు రాజధాని భూ అక్రమాల్లో పాత్ర ఉన్నట్లు తేలడంతో గతంలో సీఐడీ అరెస్టు చేసిన సీఆర్డీయే అధికారి, డిప్యూటీ కలెక్టర్ మాధవిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Recommended Video
లంక, అసైన్డ్ భూములపై దృష్టి....
గత టీడీపీ సర్కారులో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు రాజధాని ప్రాంతంలోని లంక భూములు, అసైన్డ్ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే విక్రయించి కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పటికే ఇలా తక్కువ ధరలకు కొన్న అసైన్డ్ భూముల మార్పిడిని వైసీపీ సర్కారు రద్దు చేసింది. తాజాగా వాటిని రైతుల నుంచి కొనుగోలు చేసిన వారిపైనా సిట్ దర్యాప్తు చేస్తోంది. అలాగే లంక భూముల విషయంలోనూ భారీగా డబ్బులు చేతులు మారాయని సిట్ అనుమానిస్తోంది. దీంతో తుళ్లూరులో స్ధానికులు, అధికారుల నుంచి వీటి వివరాలు రాబడుతోంది. వీటి ఆధారంగా సీఆర్డీయేలో మరికొందరు అధికారులను టార్గెట్ చేయబోతోంది. అయితే వీరిలో కొందరు అప్రూవర్లుగా మారేందుకు సిద్దమవుతుండటం కలకలం రేపుతోంది.