పులివెందుల నడి బొడ్డున ఉరి వేసుకుంటా: తప్పుంటే..ఎన్ కౌంటర్ చేసుకోవచ్చు: మాజీ మంత్రి ఆది!
మాజీ మంత్రి ఆది నారాయణ ఎట్టకేలకు సిట్ నోటీసులు అందుకున్నారు. కొద్ది రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే ప్రచారం సాగింది. అయితే, బుధవారం సిట్ నోటీసులు అందుకున్న మాజీ మంత్రి ఆది గురువారం సిట్ ముందు హాజరవుతానని స్పష్టం చేసారు. అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. వివేకా హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని గుర్తు చేసారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లాననడం తగదని, తనకు ఈ రోజే సిట్ నోటీసులు అందాయని చెప్పారు. సిట్ ముందు హాజరై వారికి సమాధానం ఇస్తానని స్పష్టం చేసారు. వివేకా హత్య కేసుపై ముందుగా సీబీఐ విచారణ కోరి, ఇప్పుడు వాళ్ల అనుకూలం కోసమే సిట్ విచారణ అంటున్నారని ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి ఆదికి సిట్ నోటీసులు
2014 ఎన్నికల్లో వైసీపీ నుండి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచి..ఆ తరువాత టీడీపీలో ఫిరాయించి మంత్రి అయి..ప్రస్తుతం బీజేపీలో చేరిన ఆది మరో సారి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారిస్తున్న సిట్ నాలుగు రోజులుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఆయన అందుబాటులోకి రాలేదు. ఇదే సమయంలో టీడీపీ నేత బీటెక్ రవితో పాటుగా వివేకా కుటుంబ సభ్యులను..ఎంపి అవినాశ్ తండ్రిని సిట్ విచారించింది. ఈ కేసు త్వరితగతిన తేల్చాలని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ నేరుగా డీజీపీని ఆదేశించటంతో..ఇప్పుడు సిట్ మరింత వేగం పెంచింది. ఇక, దీని పైన రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, కొద్ది సేపటి క్రితం సిట్ ఎట్టకేలకు మాజీ మంత్రి ఆదికి నోటీసులు అందించింది. గురువారం విచారణ కు రావాలని సూచించింది.
పులివెందుల నడిబొడ్డున ఉరి వేసుకుంటా..
వైయస్ వివేకా హత్య కేసులో ఒక్క శాతం ప్రమేయం ఉందని నిరూపిస్తే పులివెందుల నడిబొడ్డున ఉరి వేసుకుంటానని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ కుటుంబం తన పైన కక్ష్య కట్టిందని ఆరోపించారు. జాగ్రత్తగా ఉండాలని చాలా మంది తనతో చెప్పారని వివరించారు. తనది తప్పుంటే ఎన్ కౌంటర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తాను కనిపించకుండా దాక్కోవటానికి చీమ కాదని.. మనిషినని వివరించారు. విచారణకు హాజరైన వారికి 61ఏ కింద నోటీసులు ఇచ్చారని..తనకు మాత్రం 161 సీఆర్సీ కింద నోటీసులు ఇవ్వటమేంటని ప్రశ్నించారు. ఈ నెల 6న విచారణకు రావాలని తనకు డీఎస్పీ ఫోన్ చేసారని..అయితే తాను ఢిల్లీలో ఉన్నానని..ఆ సమయానికి రాలేనని చెప్పివ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి వివరించారు.
సీబీఐ విచారణకు ఇవ్వాలి..
వివేకాను హత్య చేసిందెవరో చేసిన వారి అంతరాత్మకు తెలుసని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసుపై ముందుగా సీబీఐ విచారణ కోరి, ఇప్పుడు వాళ్ల అనుకూలం కోసమే సిట్ విచారణ అంటున్నారని ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కేసును సీబీఐకు ఇవ్వాలని డిమాండ్ చేసారు. సిట్ పైన ఎవరికీ అవగాహన లేదని వ్యాఖ్యానించారు. తన మీద వచ్చిన తప్పుడు ఆరోపణలతో తన కుటుంబం మనో వేదనకు గురైందని ఆవేదన వ్యక్తం చేసారు. గురువారం ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరవుతానని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేసారు. ప్రభుత్వం తనను వేధించటం తగదని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.