దర్యాప్తునకు 20 ఏళ్లా: భూ స్కాంపై చంద్రబాబు వాదనల్లో పస ఎంత?
అసలు కుంభకోణాలపై దర్యాప్తునకు ఏనాడైనా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారా? గతంలో ఆ ఒరవడి ఉన్నదా? అంటే లేదనే సమాధానమే వస్తుంది.
విజయవాడ/ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఉత్తరాంధ్రకు ముఖద్వారంగా భావించే పోర్ట్ సిటీ విశాఖపట్నం కేంద్రంగా జరిగిందని ఆరోపణలు వస్తున్న 'భూ కుంభకోణం'పై నిష్పక్షపాత విచారణకు అనుమతించాలని సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు క్యాబినెట్ సహచరుడు గంటా శ్రీనివాసరావు మీడియా సాక్షిగా కోరారు. కానీ దీనిపై బహిరంగ విచారణకు కట్టుబడి ఉన్నట్లు చంద్రబాబు చెప్తున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణకు అనుమతినిస్తే 20 ఏళ్లు పడుతుందని సూత్రీకరణలు చేశారు. సాక్ష్యాధారాలు ఉంటే 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని భీషణ ప్రతిజ్నలు చేశారు. 20 ఏళ్లపాటు విచారణ జరుగాల్సిన అవసరమేమిటన్నదెందుకని చంద్రబాబు నాయుడు చేయడంలో కుటిలనీతి బయటపడుతున్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.
అసలు కుంభకోణాలపై దర్యాప్తునకు ఏనాడైనా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారా? గతంలో ఆ ఒరవడి ఉన్నదా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. 1999 ఎన్నికలకు ముందు ఏలేరు భూ కుంభకోణాన్ని నాటి సీనియర్ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు తీసుకొస్తే రిటైర్డ్ జడ్జితో విచారణ కమిషన్ ఏర్పాటునకే పూనుకున్నారే తప్ప.. త్వరితగతిన విచారణకు చొరవ తీసుకున్న దాఖలాలే లేవు.
చంద్రబాబుపై దగ్గుబాటి ఇలా
చంద్రబాబు అవునంటే కాదని, కాదంటే అవునని నిర్ధారించుకోవాలని ఇటీవల ఆయన తోడల్లుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రెవెన్యూశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ క్రుష్ణమూర్తి మొదలు విశాఖపట్నం జిల్లాకు చెందిన మంత్రి, తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు వరకు బహిరంగ విచారణకు చర్యలు తీసుకుంటామని మీడియా సాక్షిగా ప్రకటించారు. ఈ లోగా అంతా మారిపోయింది. పరిస్థితి తీవ్రతర స్థాయికి చేరుకున్నది.
దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకే గంటా బహిరంగ లేఖ
విశాఖపట్నంలో వెలుగుచూసిన భూ కుంభకోణం వెనుక చంద్రబాబు తనయుడు, రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి లోకేశ్ బాబు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లనే అయ్యన్నపాత్రుడు వల్ల పార్టీ పరువు పోతున్నదని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాయడంతో వాతావరణం వేడెక్కింది. పరిస్థితి తీవ్రత కనిబెట్టిన చంద్రబాబు.. ఆగమేఘాలపై సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేసి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని కట్టడి చేశారు. ఆ తర్వాతే మీడియా ముందుకు వచ్చి.. సీబీఐ విచారణ అంటే ఏళ్లూ పూళ్లు పడుతుందని సాకులు చెప్తున్నారు. ఏలేరు కుంభకోణంపై 2006లో విచారణ కమిషన్ ముందు ఒకసారి హాజరైనందుకు తెర వెనుక నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో లాలూచీ పడి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్న నేపథ్యం చంద్రబాబుది.
మహామహుల ఇంప్లీడ్ పిటిషన్లు ఇలా
చంద్రబాబు అక్రమాస్తుల కేసులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలు చేసిన పిటిషన్లను ‘బీ ఫోర్ నాట్ మీ' సాకుతో కింద దాట వేసి.. చివరకు మహామహులందరు ఇంప్లీడ్ అయి.. తెర వెనుక లాబీయింగ్ తో కేసునే నీరుగార్చిన నేపథ్యం అందరికీ కరతలామలకమే. అంతెందుకు 2015లో హైదరాబాద్ కేంద్రంగా ‘తెలంగాణ' ప్రభుత్వాన్ని నగుబాటు పాల్జేసేందుకు శ్రీకారం చుట్టిన ‘ఓటుకు నోటు' కేసులో బహిరంగంగా దొరికిపోయిందీ టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి. దాని వెనుక చంద్రబాబు ఉన్నట్లు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్సన్ ఆయన ఫోన్ సంభాషణ పర్వం బహిరంగంగా యావత్ తెలుగు ప్రజలు వీక్షించారు. ఈ కేసులోనూ హైకోర్టులో స్టే తెచ్చుకోవడం అందరి మదిలోనే ఉన్నది.
ఇలా సుప్రీంను ఆశ్రయించిన ఆర్కే
ఓటుకు నోటు కుంభకోణం కేసు దర్యాప్తు విషయమై ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే రామక్రుష్ణారెడ్డి దాఖలుచేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించి త్వరిగతిన విచారణ పూర్తి చేయాలని తెలంగాణ ఏసీబీని ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే తాజాగా వెలుగుచూసిన విశాఖపట్నం భూకుంభకోణం విషయంలోనూ చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం ఇదేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా అక్రమార్కులని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, మాజీ సీఎం సంతతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ, ఆదాయంపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర దర్యాప్తు సంస్థలు ఝుళిపిస్తున్న కొరడాతో ఆయా నేతలు అల్లాడిపోతున్నారు.
లలూ సంతతిపై బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపణలు ఇలా
2009 - 14 మధ్య కాలంలో ఢిల్లీ మొదలు దేశవ్యాప్తంగా అక్రమ ఆస్తులు బినామీ పేర్లతో కూడబెట్టారని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ కొడుకులు తేజస్వి ప్రతాప్, తేజ్ ప్రతాప్, కూతురు మీసా భారతిలపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీజేపీ సీనియర్ నేత - మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఆరోపణలపై కేంద్ర ఆదాయం పన్నుశాఖ కేసులు నమోదు చేసింది. రాజ్యసభ సభ్యురాలు మీసా భారతికి పదేపదే నోటీసులు జారీ చేసింది. జూలై మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని తాజాగా నోటీసులు జారీ చేసింది ఐటీ శాఖ. అంతే కాదు బినామీ చట్ట నిబంధనల ప్రకారం రూ.50 కోట్ల ఆస్తులు జప్తునకు ఆదేశాలు జారీచేసింది. జప్తు చేసిన ఆస్తుల లావాదేవీలకు మార్గాలు వివరించాలని ఆయా నోటీసుల్లో స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
యెడ్యూరప్ప సహా మాజీ సీఎంలపై ఆరోపణలు ఇలా
జంతాకల్ గనుల కేటాయింపుల్లో అవకతవకలకు కారణమని అభియోగాలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు బెంగళూరు న్యాయస్థానం నిరాకరించింది. 2006 - 07 మధ్య సీఎంగా కుమారస్వామి పని చేశారు. జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు - మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తనయుడే కుమార స్వామి. కానీ తనకు ఎటువంటి పాపం తెలియదని, తాను ఎటువంటి పొరపాటు చేయలేదని, న్యాయమేమిటో బయటపడుతుందని వ్యాఖ్యానించారు. పలు పత్రాలను తారుమారుజేసి, చట్టాల్లో నిబంధనలను ఉల్లంఘించి మరీ 40 ఏళ్ల పాటు అనుచితంగా లీజుకు ఇచ్చారని కుమారస్వామిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో గత నెలలో అరెస్టయిన సీనియర్ బ్యూరోక్రాట్పైనా ఒత్తిడి తెచ్చారని కుమార స్వామి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. భారీగా ముడుపులు అందుకున్నారని విమర్శలు వచ్చాయి. మైనింగ్ బారన్ - జంతకల్ అధినేత వినోద్ గోయల్ రెండేళ్ల క్రితం అరెస్టయ్యారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప సహా పలువురు రాజకీయ నాయకులపైనా గనుల కేటాయింపుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యెడ్యూరప్ప సైతం గనుల కుంభకోణంలో లోకాయుక్త ప్రశ్నించడం వల్లే తప్పుకోవాల్సి వచ్చింది.
టాక్ టు ఏకేపై దర్యాప్తునకు సీబీఐ చర్యలు
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం తమకు ప్రత్యర్థులుగా ఉన్న వారినెవ్వరినీ విడిచిపెట్టడం లేదు. రెండేళ్ల క్రితం హస్తినలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో తనను ఘోర పరాజయానికి గురి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అంటే ప్రధాని నరేంద్రమోదీ భగ్గున మండిపడ్తారు. తొలుత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయ ముఖ్య కార్యదర్శిపై కేసులు నమోదు చేశారు. మంత్రులు మాజీలుగా మారిపోవడానికి కారకులయ్యారు. తాజాగా నరేంద్రమోదీ ‘మన్ కీ బాత్' మాదిరిగా ‘టాక్ టు ఏకే' కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలతో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ తనిఖీలు చేయించింది. దీనిపై మనీశ్ సిసోడియా మీడియా సలహాదారు అరుణోదయ్ ప్రకాశ్ ధీటుగానే రియాక్టయ్యారు. మనీశ్ సిసోడియా కార్యాలయంపై దాడి చేస్తే భయపడతారని భావిస్తే అది వారి పొరపాటే అవుతుందని పేర్కొన్నారు.
వైఎస్ జగన్పై బాబు ఇలా
వాస్తవాలిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు సీబీఐ దర్యాప్తు అంటే ఏళ్ల సమయం పడుతుందని అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై మాత్రం సవాళ్లు విసురుతుంటారు. గురివింద తన నలుపు తెలియదన్నట్లు ఇతరులు మాత్రమే అపవిత్రులని, తాను పరిశుద్ధుడినని తనకు అండగా ఉన్న మీడియా దన్నుతో ఎదురుదాడి చేస్తూ తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తుంటారు చంద్రబాబు. ఒకవేళ సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే, ఎక్కడ తమ తప్పులు బయటపడుతాయన్న అనుమానంతోనే వెనుకంజ వేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.