మోడీతో కలిసి ఘనకార్యం చేస్తామన్నారు: బాబును ఏకేసిన ఏచూరి, 8న రాష్ట్రబంద్
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు ఏవీ అమలు కావడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం... ఏపీకి ఎలాంటి సాయం చేయడం లేదని ఆయన మండిపడ్డారు.
కనీసం ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వడం లేదని అన్నారు. బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని విడదీసిన క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా, అంతకంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని బీజేపీనే చెప్పిందని. కానీ ఆ మాట తప్పిందని విమర్శించారు.
ప్రజలే బుద్ధి చెబుతారు
ఏపీకి ఏదైనా ఇస్తే పక్క రాష్ట్రాలతో ఇబ్బంది వస్తుందనే వాదన పూర్తిగా అసంబద్ధమని చెప్పారు. బీజేపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విడదీసినప్పుడు అక్కడ ఏమేం ఇవ్వాలో, ఏమేం చేయాలో అంతా చేశారని... మరి ఏపీకి మాత్రమే ఇబ్బందులు ఎందుకని ఏచూరి అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి బీజేపీకి సరైన సమాధానాన్ని ప్రజలే ఇస్తారని తెలిపారు.
ఏపీకి ఒరిగిందేమీ లేదు
కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావనే లేకపోవడం చాలా దారుణమని అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు లేవని చెప్పారు. టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఏపీకి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఏపీకి నిధులు వస్తాయని ఊదరగొట్టినవాళ్లు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు.
బాబు ఘనకార్యం చేస్తామన్నారు
‘ఉత్తరాంధ్ర చర్చా వేదిక' డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని, తమ పూర్తి మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యులు శనివారం సీపీఎం నేతలను కలిశారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు 10 ఏళ్లు అధికారానికి దూరం అయ్యావు. మళ్లీ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావని చంద్రబాబు అడిగాను. మేమిద్దరం కలిసి ఘనకార్యం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఆ ఘనకార్యం ఏమిటో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం'అని అన్నారు.
చంద్రబాబు చేతులు దులుపుకుంటే..
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ... ‘నరేంద్ర మోడీ, చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముంచారు. చంద్రబాబుకు ఎప్పుడూ మాట మార్చడం అలవాటే. ఇవాళ ఆగ్రహం, రేపు సంతోషం. రాష్ట్రం పట్ల బీజేపీ సవతి తల్లి ప్రేమను టీడీపీ ఇన్నాళ్లు కప్పిపెడుతూ, సంరక్షిస్తూ వచ్చింది. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా మోసం చేసిన తర్వాత, తనదాకా వచ్చిన తర్వాత, ఎన్నికల ముందు చంద్రబాబు కోపాన్ని నటిస్తున్నారు. మొత్తం తప్పునంతటినీ కేంద్ర ప్రభుత్వంపై నెట్టి, చంద్రబాబు చేతులు దులుపుకోవాలంటే కుదరదు. ప్రత్యేక ప్యాకేజీ అని ఇన్నాళ్లు ఊరించారు. అది ఇప్పుడు ఉత్తదే అని తేలింది. దీనికి చంద్రబాబు బాధ్యత వహించాల్సిందే. కేంద్రంతో పోరాడితేనే రాష్ట్రానికి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయాన్ని గత అనుభవాలే చెప్పాయి. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువ' అని ఆరోపించారు. కాగా, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుతో సహా, తమ డిమాండ్లన్నింటినీ అమలు చేసేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
8న రాష్ట్ర బంద్.. బాబు, జగన్, పవన్ స్పందించరేం?
కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఫిబ్రవరి 8న రాష్ట్ర బంద్కు పిలుపునిస్తున్నట్లు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పార్టీలు బంద్లో పాల్గొనకపోతే ఏపీకి అన్యాయం చేసినట్లేనని అన్నారు. బడ్జెట్లో పోలవరం ప్రస్తావన లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామనడమే తప్ప, వారు రాజీనామాలు చేయరన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగితే సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. వారంతా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.