రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాతి చర్యలతో మెరుగు: గంటా
గుంటూరు/ మచిలీపట్నం: అర్కిటెక్ట్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిస్థితి మెరుగైందని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. నాగార్జున యూనివర్శిటీలో పలు మార్పులు చేశామని ఆయన శనివారనాడు చెప్పారు. ఇన్చార్జి వీసీగా ఉదయలక్ష్మీని నియమించిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలపై మంత్రి గంటా సమీక్షించారు.
త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. పాఠశాలల్లో నిర్వహణ సక్రమంగా లేకపోతే ప్రధానోపాధ్యాయులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటికి ఒకే రంగు వేస్తామని, త్వరలో ఉపాధ్యాయుల భర్తీని చేపడతామని గంటా చెప్పారు.
డిఎస్పీపై వారం లోపు కమిటీ నివేదిక వస్తుందని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కార్యాచరణ ఉంటుందని అన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుపై అంశంపై ఈ నెల 27వ తేదీన విద్యాశాఖ అధికారులతో కలిసి సింగపూర్ పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రతినిధులతో ఢిల్లీలో భేటీ కానున్నట్లు మంత్రి తెలిపారు.
భూములు ఇచ్చేవారికి అన్యాయం చేయం
పోర్టు నిర్మాణానికి భూములిచ్చే రైతులకు అన్యాయం చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంధ్ర చెప్పారు. బందరు మండలం తపసుపూడి, మంగినపూడి గ్రామాల్లో రైతులతో మంత్రి ర వీంధ్ర మాట్లాడారు. రైతులు సలహాలు, సూచనలు ఇస్తే వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. తమ తాతల కాలం నాటి నుంచి వచ్చిన భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. రైతుల సమావేశంలో ఎంపీ కొనకళ్ల నారాయణ కూడా పాల్గొన్నారు.