నేను సరే.. మోడీ-లక్ష్మీపార్వతిల మాటేమిటి: శివాజీ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ మీద దాడిపై ఇలా
అమరావతి: ఏపీలో తాను చెప్పింది చెప్పినట్లు జరుగుతోందని నటుడు శివాజీ బుధవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆపరేషన్ గరుడను ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. తనను టార్గెట్ చేస్తే అబాసుపాలు అవుతారని అన్నారు.
ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెప్పడం అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఏపీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయిందని చెప్పారు. అందుకే అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతోందని అన్నారు.
నిందితుడి నుంచి ఎక్కువ కాల్స్ మహిళకే: ప్లాన్లో భాగంగా అతన్నేం చేస్తారు?.. విజయసాయి వీడియో పోస్ట్
నన్ను సరే.. మోడీ, లక్ష్మీపార్వతిలను విచారించండి
ఆపరేషన్ గరుడ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై అరెస్టు చేసి విచారణ జరిపించాలని, తనపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ, వైసీపీ నేతల వ్యాఖ్యలకు శివాజీ గట్టి కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ నా హత్యకు సుఫారీ ఇచ్చారని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అందుకు మోడీపై చర్యలు తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. మోడీపై చర్యలు తీసుకోవచ్చంటే తనపై కూడా తీసుకోవచ్చునని చెప్పారు. అలాగే తనను చంపేస్తారేమోనని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి లాంటి వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఆమెను కూడా కూర్చోబెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తనను ఎవరు చంపేస్తారో విచారణలో తేల్చాలన్నారు.
మొదట ఆపరేషన్ గరుడ నాకు హాస్యాస్పదంగానే అనిపించింది
తాను రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం ఎంతో తపన పడుతున్నానని, తన తపన అర్థం కాని మూర్ఖులే తనను విమర్శిస్తున్నారని శివాజీ చెప్పారు. తనకు తెలిసిన విషయం చెప్పానని, నేను చెప్పింది మంచి విషయమో కాదో ఆలోచించాలని హితవు పలికారు. ఆపరేషన్ గరుడ గురించి తొలుత నేను విన్న సమయంలో తనకు కూడా హాస్యాస్పదంగానే అనిపించిందని చెప్పారు.
మీరు చెబితే వచ్చేది లేదు
తాను ఎలాంటి మోసాలు, ఘోరాలు చేయలేదని, ప్రజలకు మంచి విషయాలు చెప్పానని శివాజీ అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఉడుత ఊపులకు వచ్చేది రానని తేల్చి చెప్పారు. దర్యాఫ్తు సంస్థలు రమ్మంటే మాత్రం వస్తానని చెప్పారు.
వైసీపీ, జనసేన, బీజేపీలు కలవొచ్చు, జగన్ మీద దాడి ఘటనపై..
వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, జనసేనలు త్వరలో కలిసిపోవచ్చునని శివాజీ జోస్యం చెప్పారు. గుమ్మడిగాయల దొంగల్లా ఉండటం ఎందుకని ప్రశ్నించారు. జగన్ ఎపిసోడ్ (జగన్ పైన కత్తితో దాడి ఘటన) ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న విధంగా ఉందని ఎద్దేవా చేశారు.
నేనేం చెంచాను కాదు
ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు చేస్తున్న పోరాటాన్ని తాను ఆహ్వానిస్తున్నానని శివాజీ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో నాడు టీడీపీని విమర్శించిన మాట వాస్తవమే అన్నారు. తిట్టమంటే తిట్టడానికి, పొగడమంటే పొగడటానికి నేను చెంచాను కానని చెప్పారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన అంశాల్లోను రాష్ట్రాన్నే కొందరు నేతలు నిందిస్తున్నారన్నారు. హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని ఎందుకు విమర్శించడం లేదన్నారు. ఇలాంటి విషయాల్లో ప్రజలకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కేంద్రాన్ని చొక్కా పట్టుకొని ఎందుకు అడగడం లేదని నిలదీశారు.