శివాజీ దీక్ష, పెద్దలతో ఢీ: హోదాపై బీజేపీ సాకు వ్యూహాత్మకమేనా?
హైదరాబాద్: 'ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా' కథ కంచికేనా? అంటే ప్రస్తుతానికి మాత్రం అవుననే అంటున్నారు. ప్రత్యేక హోదా పైన భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు గత యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన చేసింది. స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందనే జంకు బీజేపీలో ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా ఆలస్యం వెనుక కారణం అదే అయి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వీటితో పాటు పలు రాష్ట్రాలు కూడా ఏపీకి ప్రత్యేక హోదాను ప్రశ్నిస్తున్నాయి. దీనిని బీజేపీ సాకుగా చూపించేందుకు ఉపయోగపడుతోందని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని, కానీ ఎప్పుడు ఇస్తామో కచ్చితంగా చెప్పలేమని ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మిగతా ఏపీ బీజేపీ నేతలు, ఇతర మంత్రులు అదే చెబుతున్నారు. దీనిపై ఏపీలో అధికారంలో ఉన్న, బీజేపీ భాగస్వామి అయిన టీడీపీ కూడా గట్టిగా నిలదీయడం లేదనే చెప్పవచ్చు.
నాలుగు రోజుల క్రితం ప్రత్యేక హోదా పైన పార్లమెంటులో ప్రకటన చేసిన సమయంలో టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత అంత వేడి, వాడి కనిపించలేదని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రత్యేక హోదాపై పెద్దగా నిలదీయడం లేదనే చెప్పవచ్చు. ఇందులో ఎవరి రాజకీయ వ్యూహాలు వారికి ఉండవచ్చు.
ఏపీలో, బీజేపీ ఇటీవలి కాలంలో బాగా పుంజుకుంటోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో రెండు లక్షల సభ్యత్వం ఉన్న బీజేపీ ఇప్పుడు 24 లక్షలకు పెరిగింది. ఓ వైపు ప్రత్యేక హోదా పైన బీజేపీ తిరకాసు పెడుతున్నప్పటికీ ఏపీలో పుంజుకుంటుండడం గమనార్హం.
బీజేపీ ఎప్పటికైనా ప్రత్యేక హోదా ఇస్తుందనే అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఉండి ఉంటుందని అంటున్నారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీజేపీ బలంగా వాదించింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి తప్పదనే చెప్పవచ్చు. ఇవ్వకుంటే మాత్రం, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ పార్టీకి ఏపీలో కాంగ్రెస్ మాదిరే నూకలు చెల్లడం ఖాయమని అంటున్నారు.
అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ అంశం ప్రయోజనం చేకూర్చుతుంది. కాంగ్రెస్.. ఆ పార్టీకి చిరంజీవి అండ పూర్వవైభవం తీసుకు రావొచ్చు. అయితే, ఏపీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీ... కాంగ్రెస్ పార్టీ పెరిగే అవకాశం లేదా టీడీపీకి ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవచ్చునని చెబుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అడపాదడపా ప్రశ్నిస్తున్నారు. అయితే హీరో శివాజీ మాత్రం ఏకంగా నిరాహార దీక్ష చేపట్టడం చర్చనీయాంశమైంది. ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఏకిపారేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు దీక్ష విరమించనని చెబుతున్నారు.