అసలు మీరెవరు, మాకు నీతులు చెబుతావా?: బాబును ఏకేసిన శివాజీ
ప్రత్యేక హోదా అంశంపై నటుడు శివాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ద్వారా చురకలు అంటించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై నటుడు శివాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ద్వారా చురకలు అంటించారు. విశాఖ ఆర్కే బీచ్లో నిరసనలకు పోలీసులు నో చెప్పడంపై శివాజీ ఘాటుగా స్పందించారు.
అమ్మ పెట్టదు..
సీఎం చంద్రబాబును, పోలీసు అధికారులను నిలదీశారు. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ఈ రోజు ఏపీలో పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయడం లేదని, చేసేవాళ్లను అడ్డుకుంటోందని మండిపడ్డారు.
అదో ఓ ఉంపుడుగత్తె, పడేస్తే ఉంటుంది, హోదా వల్ల ఇదీ లాభం: శివాజీ
మీకొచ్చే నష్టమేంటి?
'ఏమిటండీ ఇది?.. అసలు చంద్రబాబు నాయుడుగారు.. ఆయన మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు ఎందుకు ఫీలవుతున్నారో అర్థం కావడం లేదు. ఇది ఆయన మీద పోరాటం కాదండీ.. భావితరాల జీవన్మరణ సమస్య ఇది. హోదా అనేది ఏపీలో ఉన్న ప్రతి బిడ్డ హక్కు. ఈ హక్కు కోసం వాళ్ల నిరసనను తెలియజేయడానికి ఆర్కే బీచ్కు వస్తే మీకొచ్చే నష్టం ఏమిటండీ' అని చంద్రబాబును నిలదీశారు.
ఆ ముద్ర వేసుకోకండి
పట్టిసీమ, పోలవరం తప్ప ఏపీలో ఏమైనా జరిగిందా అని అడిగారు. రాజకీయనాయకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అన్నారు. ఒకప్పుడు మీరు రైతు వ్యతిరేకి, ఉద్యోగి వ్యతిరేకి అనే ముద్రలు వేసుకున్నారని, ఇప్పుడు యువత వ్యతిరేకి అన్న ముద్ర మాత్రం వేసుకోవద్దన్నారు.
'దయచేసి... అది మీకు మంచిది కాదు. అసలు మీరు వ్యక్తిగతంగా ఎందుకు ఫీలవుతున్నారు? మీకొచ్చిన సమస్య ఏంటి?' అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
అలా అడుగుతారా?
మనం శాంతియుతంగా చేయాలనుకున్నప్పుడు సంఘవిద్రోహశక్తులు దూరుతాయని, లేదంటే ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్లు తమ స్వార్థం కోసం అందులో చేరి గొడవలు చేస్తే పిల్లలకు ఏమన్నా అవుద్దేమోనని భయపడడంలో తప్పు లేదని, కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు వచ్చి అడిగారు? అనే ప్రశ్నలు వేసే ముందు.. మీరు ఏపీకి చెందినటువంటి ఒక బిడ్డ అని మర్చిపోవద్దన్నారు.
శాంతియుతంగా చేయాలనుకుంటున్నప్పుడు.. మా విద్యార్థులకు, మా యువతకు మేం సపోర్ట్ చేస్తామని చెప్పాలని, పోలీసులుగా మీ ధర్మం మీరు నిర్వర్తించాలని చెప్పాలన్నారు.
ఎప్పుడో తేలిపోవాల్సిన విషయాన్ని చంద్రబాబు, వెంకయ్యలు నీరుగార్చారన్నారు. దీని వల్ల రాబోయే తరాలు నాశనమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల మనోభావాలు గుర్తించని ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత అన్నారు.
ఆయన రావాలి: రామచంద్రయ్య, మరి ఎలా.. నాశనం చెయ్యడమే: పవన్ కళ్యాణ్
అలా అయితే అసలు మీరెవరు?
ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలనుకుంటే అనుమతివ్వడానికి, ఇవ్వకపోవడానికి మీరెవరు? ప్రశ్నించారు. శాంతియుతంగా చేసుకొనే హక్కు మాకు లేదా? మేము ఓట్లేస్తే గెలిచిన మీరు మాకు నీతులు చెబుతారా? ఈ రోజున రోడ్డు మీద జరిగే వందలాది ప్రమాదాలకు మీరు బాధ్యత వహిస్తారా? అని ఘాటుగా ప్రశ్నించారు.
మన దగ్గర డబ్బు వచ్చేదాన్ని వదిలేసుకుని ఎవడో పెట్టేదాన్నిగురించి మీరు ఆలోచిస్తున్నారని, మీరు నమ్మినా నమ్మక పోయినా ప్రత్యేక హోదా వల్ల ఏపీకి అయిదేళ్లలో దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని, ఆ డబ్బుతో మీరు సింగపూర్ కట్టొచ్చు.. శ్రీలంక కట్టొచ్చు. ఏదైనా కట్టవచ్చునని చెప్పారు.