అలా చేస్తే టీడీపీని ప్రజలే గద్దె దించేస్తారు: శివాజీ, ‘సీఎం’ దీక్షకే మద్దతు, టీడీపీకి కాదు!
కడప: కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ ప్రతిపక్షాలపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు సినీనటుడు శివాజీ. కడపలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలను ఆయన మంగళవారం పరామర్శించి సంఘీభావం తెలిపారు.
Recommended Video
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. విభజనతో నష్టపోయిన తమ రాష్ట్రానికి హోదా చాలా అవసరమని అన్నారు. ఏపీ హక్కుల కోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
రెచ్చగొట్టే చర్యలు
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రను ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని శివాజీ మండిపడ్డారు. కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం కేటాయించని బీజేపీ.. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
టీడీపీకి మద్దతివ్వడానికి రాలేదు
ఏపీకి రూ.2లక్షల కోట్ల అప్పు ఉందని కొందరు నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రస్తుతం ఏపీకి రూ.82వేల కోట్ల అప్పు మాత్రమే ఉందని చెప్పారు. అందులో విభజన వల్ల వచ్చిన అప్పే రూ.52వేల కోట్లని శివాజీ తెలిపారు. తాను టీడీపీకి మద్దతివ్వడానికి రాలేదని, ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన నేతలకు సంఘీభావం తెలపడానికి వచ్చానని తెలిపారు.
అలా చేస్తే టీడీపీని ప్రజలే గద్దె దించేస్తారు
కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రంతో అంటకాగడం దుర్మార్గమైన చర్య అని శివాజీ మండిపడ్డారు. హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఓట్లేసీ అధికారం కట్టబెట్టిన పార్టీకి ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వాలని, వారు తప్పు చేస్తే తర్వాత ఎన్నికల్లో ప్రజలే గద్దె దించేస్తారని శివాజీ అన్నారు.
ఏపీ ప్రజలు తొక్కిపడేస్తారు
ఎన్నో ఏళ్లుగా శ్రీవారి సేవలో ఉన్న రమణ దీక్షితులు పదవి కోల్పోగానే టీటీడీపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఆయన్ని ఎవరూ తొలగించలేదని, ఆయన సేవలు ఇక చాలని ఆ వెంకటేశ్వరస్వామే విశ్రాంతి కల్పించారని చెప్పారు.
తిరుమల ఆలయాన్ని రాష్ట్రం నుంచి వేరు చేసేలా రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తొక్కిపడేస్తారని శివాజీ హెచ్చరించారు.