చంద్రబాబునే అంటారా, ఎక్కడో చెప్పు: పవన్ను ఏకేసిన శివాజీ, సీఎంకు కేవీపీ లేఖ
Recommended Video
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నటుడు శివాజీ ఆదివారం నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. అమరావతిని ఆపేస్తామని చెబుతున్న పవన్ దానిని ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే పవన్, జగన్లు ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
ప్రధాని మోడీ 54 దేశాలు తిరిగితే ఒక్క పరిశ్రమ రాలేదని, చంద్రబాబు లక్ష కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు నవ్యాంధ్రకు తెచ్చారన్నారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే రైళ్లు ఆపేందుకు, కేంద్ర ప్రభుత్వం సంస్థలను స్తంభింపచేసేందుకు సిద్ధమని, పవన్, జగన్లు వస్తారా అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. మనం గట్టిగా, ఐక్యంగా నిలబడితే ప్రత్యేక హోదా వస్తుందని శివాజీ అన్నారు.
చంద్రబాబుకు కేవీపీ లేఖ
కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ రామచంద్ర రావు సీఎం చంద్రబాబుకు ఆదివారం లేఖ రాశారు. ఒంగోలు ధర్మపోరాట దీక్షలో అసత్యాలు, పరనిందలే అన్నారు. ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మార్చే స్వభావం చంద్రబాబుది అన్నారు. బరువు తగ్గడానికే దీక్షలు చేస్తున్నారని, అందులో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దీక్షల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
విభజన చట్టం అమలు గురించి పోరాటం చేస్తోంది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ప్రత్యేక హోదా అంశం గురించి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోనియా గాంధీ లేఖ రాశారని గుర్తు చేశారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్నోసార్లు మాటలు మార్చారన్నారు. హోదా అంటే జైలుకే అన్నారు కూడా అని గుర్తు చేశారు. అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కూడా నోటీసు ఇచ్చిందని, కానీ టీడీపీ ముందు ఇచ్చిందనే ఉద్దేశ్యంతో అండగా నిలిచామన్నారు. దీక్షల పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం ఆపాలన్నారు.