వాన్పిక్, దొనకొండల్లో రాజధాని కమిటీ, బాబుకు ప్రశంస
హైదరాబాద్/ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం నియమించబడిన శివరామకృష్ణమన్ కమిటీ ఆదివారం వాన్పిక్, దొనకొండలలో పర్యటించింది. కమిటీ సభ్యులు దొనకొండలోని ప్రాచీన విమానాశ్రయాన్ని, ప్రభుత్వ భూములను పరిశీలించారు. అంతకుముందు వారు జిల్లాలోని కొత్తపట్నం మండలంలో పర్యటించారు. అక్కడ వాన్పిక్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను, బకింగ్ హాం కాలువను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా రాజధాని నిర్మాణం జరగాలన్నారు. సారవంతమైన భూములను సేకరిస్తే వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతిని ఆహార భద్రత పైన ప్రభావం పడుతుందన్నారు. రాజధానికి సమీపంలో రైలు, రోడ్డు, విమానాశ్రయాలు ఉండాలన్నారు. తక్కువ ధరలో వ్యవసాయానికి అనువుగా లేని భూములు సేకరించాల్సి ఉంటుందన్నారు.
దివిసీమ ఉప్పెనను ప్రస్తావిస్తూ.. అలాంటి విపత్తులు తట్టుకునేలా కొత్త రాజధాని ఉండాలన్నారు. దీనికి అనువైన ప్రాంతాల ఎంపికతో పాటు అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నివేదికలు రూపొందిస్తామన్నారు. తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రాంతాల వారీగా ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆగస్టు నెలాఖరును నివేదిక ఇస్తామన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు పలు ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మూడు నుండి 5 పెద్ద నగరాలతో పాటు 15 చిన్న, మధ్య తరహా పట్టణాలను అభివృద్ధి చేయాల్సి ఉందని, దీనిపై సీఎం చంద్రబాబు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. తీరం వెంట రోడ్డు, రైలు మార్గాలు ఉండటం రాష్ట్రానికి లాభించే అంశమన్నారు. రైల్ నెట్ వర్కును బలోపేతం చేసేందుకు మోడీ ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.
వాన్పిక్ ప్రాజెక్టుకు కేటాయించిన 17,703 ఏకరాలు, దొనకొండ పరిసరాల్లోని 68,741 ఏకరాలు రాజధాని నిర్మాణానికి అందుబాటులో ఉన్నాయని, అవి అనుకూలమైన ప్రాంతాలని ఒంగోలు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దొనకొండను రాజధానిగా ఎంపిక చేయాలని నేతలు, ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు.
కడప జిల్లాలో రాజధాని కమిటీ పర్యటన
శివరామకృష్ణన్ కమిటీ సోమవారం కడప జిల్లాలో పర్యటించనుంది. కమిటీ రేపు ఉదయం 10.30కి జిల్లా అధికారులతో భేటీ అవుతుంది. పర్యటన సందర్భంగా రాజధాని ఏర్పాటుకు సంబంధించి వినతులు, అభిప్రాయాలు స్వీకరిస్తారు.
పంటపొలాలు నాశనం చేయవద్దు: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం పంటపొలాలను నాశనం చేయవద్దని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. తిరుపతిలో ఆయన మాట్లాడారు. బంజరు భూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలన్నారు. వ్యవసాయభూములను కోల్పోతే రైతుల పరిస్థితి దయనీయంగా తయారవుతుందన్నారు.