శివారెడ్డి హత్య: బాలకృష్ణ సహా ఏడుగురిపై కేసులు, మంత్రి సునీతపై వైసీపీ నేత ఆరోపణలు
అనంతపురం: కందుకూరులో వైసీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యపై ఆ పార్టీ భగ్గుమంటోంది. మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని రాప్తాడు వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
వైసీపీ నేత శివారెడ్డి దారుణ హత్య: టీడీపీ కార్యకర్తల పనేనా?
శివారెడ్డి హత్యపై అనంతపురంలో మీడియాతో మాట్లాడారు ప్రకాష్ రెడ్డి.మంత్రి పరిటాల సునీత అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని శివారెడ్డి ఎన్నిసార్లు పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. మంత్రి ఆదేశానుసారమే పోలీసులు శివారెడ్డి ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
శివారెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి సునీత, ఆమె కుటుంబీకులపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం లేదన్నారు.
బాలకృష్ణ సహా ఏడుగురిపై కేసులు:
శివారెడ్డి హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు, టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, వారి సమీప బంధువులు మురళీ, మహేంద్రల పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ వారిపై కేసులు నమోదు కాలేదు.