టీవీ9 యాంకర్ దీప్తిపై దాడి: జైలు నుంచి రైతులు విడుదల: ఘనస్వాగతం పలికిన టీడీపీ మాజీమంత్రి
గుంటూరు: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 యాంకర్ దీప్తిపై దాడి చేసిన కేసులో అరెస్టయిన రైతులు బెయిల్ పై విడుదల అయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫు న్యాయవాది వారికి బెయిల్ ఇప్పించినట్లు సమాచారం. రైతులు విడుదలైన తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. జైలు నుంచి అమరావతి ప్రాంతం వరకు ఈ విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. రైతులపై పూలు చల్లుతూ టీడీపీ నాయకులు, గ్రామస్తులు వారికి ఆహ్వానం పలికారు.
డీజీపీకి ఫిర్యాదు.. ఆ వెంటనే అరెస్టులు..
రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయుని పాలెం వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వెళ్లిన న్యూస్ యాంకర్ దీప్తిపై రైతులు దాడి చేసిన విషయం తెలిసిందే. తమను ఉద్దేశించి ఆమె పెయిడ్ ఆర్టిస్టులు అని ఎద్దేవా చేసినందు వల్లే ఆమెపై దాడి చేయాల్సి వచ్చిందని రైతులు ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ దీప్తి.. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
టీడీపీ నేతల చొరవతో బెయిల్..
ఈ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరుమందిని అరెస్టు చేశారు. గోగులపాటి సురేంద్ర, పత్తిపాటి శ్రీనివాసరావు, రామినేని నరసింహారావు, ధనశిరి నరేష్, బండారు నాగరాజు, భూక్యా లోకానాయక్ లపై కేసు నమోదు చేశారు. వారిని గుంటూరు జైలుకు తరలించారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజధాని అమరావతి ప్రాంత ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు మంగళగిరి న్యాయస్థానంలో బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా.. దానికి అనుమతి లభించింది.
విజయోత్సవ ర్యాలీగా..
దీనితో సాయంత్రానికి ఈ ప్రక్రియను ముగించారు. రాత్రి ఆరుమంది రైతులను విడుదల చేశారు. గుంటూరు జైలు నుంచి విడుదలైన అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీని చేపట్టారు. గుంటూరు జైలు నుంచి అమరావతి ప్రాంతం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ అమరావతి ప్రాంతంలో వారికి ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు.
జై అమరావతి అంటూ..
ఈ సందర్బంగా వారంతా జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జైకొట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని రైతులు చెప్పారు. అమరావతిని పరిరక్షించుకునే దిశగా తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. మరింత మంది రైతులను సమీకరించి, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.