యూకె నుంచి ఏపీకి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్...
ఇటీవల యూకె నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. అనంతపురం,తూర్పు గోదావరి,కృష్ణా,నెల్లూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున,గుంటూరు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ మేరకు శనివారం(డిసెంబర్ 26) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.
యూకె నుంచి మొత్తం 1214 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. వీరిలో 1158 మందిని ట్రాక్ చేసిన అధికారులు... వీరందరినీ క్వారెంటైన్లో ఉంచారు. వీరికి సోకింది కొత్త రకం వైరసా లేక పాత వైరసా అన్నది నిర్దారించేందుకు శాంపిల్స్ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించారు. యూకె నుంచి వచ్చిన మరో 56 మంది వివరాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటకలోనూ యూకె నుంచి వచ్చిన 14 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. కేరళలో యూకె నుంచి వచ్చిన 8 మందికి పాజిటివ్గా నిర్దారణ అయింది. వీరందరి శాంపిల్స్ను పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు. ఇటీవలి కాలంలో బ్రిటన్ నుంచి కర్ణాటకకు మొత్తం 2500 మంది రాష్ట్రానికి వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు.
బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ వెలుగుచూడటంతో ఈ నెల 23 నుంచి 31 వరకూ భారత్ బ్రిటన్కు విమాన రాకపోకలు నిషేధించింది. అయితే 23వ తేదీ అర్ధరాత్రి వరకూ వేల సంఖ్యలో ప్రయాణికులు యూకె నుంచి భారత్ చేరుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయా రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం... యూకె నుంచి తెలంగాణకు 358 మంది, ఢిల్లీకి దాదాపు 7వేల మంది,చెన్నైకి 1088 మంది వచ్చారు. అన్ని రాష్ట్రాల అధికారులు ప్రస్తుతం యూకె రిటర్నీస్ను ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వీరికి కరోనా టెస్టులు నిర్వహించి క్వారెంటైన్లోకి పంపిస్తున్నారు.