బతుకమ్మ ఆట: ఏపిఎన్జీవో భవన్లో స్వల్ప ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని ఏపి ఎన్జీవో భవన్లో తెలంగాణ, ఏపి ఎన్జీవోల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. తెలంగాణ ఎన్జీవోలు బతుకమ్మ ఆడతామంటూ అబిడ్స్లోని ఏపి ఎన్జీవో భవన్లోకి చొచ్చుచుకుని వచ్చారు. వారి ప్రయత్నాన్ని ఏపి ఎన్జీవోలు అడ్డుకున్నారు.
దీంతో వారి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఏపి భవన్లో బతుకమ్మ ఆడటం సరికాదని ఏపి ఎన్జీవోలు తెలంగాణ ఉద్యోగులకు సూచించారు. మండిపడిన టీఎన్జీవోలు.. ఏపిఎన్జీవో భవన్ బోర్డును మార్చేందుకు ప్రయత్నించారు.
దీంతో ఏపిఎన్జీవోలు టీఎన్జీవోలను ఏపిభవన్ నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత ఏపిఎన్జీవోలు ఏపి భవన్ మెయిన్ గేటుకు తాళం వేశారు. ఆగ్రహానికి గురైన టీఎన్జీవోలు గేటు తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించారు.
ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. వారిని అక్కడ్నుంచి పంపించేశారు. ఇరువురిని శాంతింపజేసిన పోలీసులు, పరిస్థితిని సద్దుమణిగేలా చూశారు.