పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం, ఢీకొట్టిన లారీ: పలువురికి గాయాలు
Recommended Video
రాజానగరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. బహిరంగ సభ కోసం ఆయన కాకినాడ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్తుండగా స్వల్ప ప్రమాదం జరిగింది.
జనసేనాని కాన్వాయ్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ ప్రయివేటు సిబ్బందికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు బౌన్సర్లు. ఎనిమిది మంది గాయపడ్డారు. రంగంపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. అందరికి చిన్న గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పవన్ కాకినాడ నుంచి సభా ప్రాంగణానికి వస్తుండగా రంగంపేట మండలంలోని రామేశంపేట వద్ద ఆయన ప్రయివేటు భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొట్టింది. ఎనిమిది మందికి గాయాలు కాగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించారు.
పవన్ ప్రయాణిస్తున్న వాహనం ముందే సభా వేదిక వద్దకు వెళ్తుండగా.. ఆ తర్వాత వెళ్తున్న ప్రయివేటు భద్రతా సిబ్బంది వాహనం ప్రమాదానికి గురయింది. గాయపడిన వారిలో శివ, నవీన్, అరవింద్, శ్రీకాంత్, రామకిశోర్, జావీద్, బాబి, శ్రీకాంత్ ఉన్నారు.